గోరంట్లలో 8 మంది క్వారంటైన్కు..
ABN , First Publish Date - 2020-04-08T09:47:49+05:30 IST
హిందూపురంలో కరోనా వైరస్ బాధితులు బయటపడటం, వారి కాంటాక్టులు గోరంట్లలో ఉండటంతో మండలంలో అధికారులు
గోరంట్ల, ఏప్రిల్ 7: హిందూపురంలో కరోనా వైరస్ బాధితులు బయటపడటం, వారి కాంటాక్టులు గోరంట్లలో ఉండటంతో మండలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం 8 మందిని క్వారంటైన్కు తరలించారు. హిందూపురంలో ఫిజియోథెరపిస్టుకు కరోనా పాజిటివ్ రావటంతో అతడి వద్ద చికిత్స చేయించుకున్న పలువురు గోరంట్లవాసులను అధికారులు గుర్తించారు. తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ గిరిధర్, దీప్తి, సునీల్, వైద్య సిబ్బంది, సీఐ జయనాయక్, ఎస్ఐ వంశీకృష్ణ మంగళవారం సమావేశమయ్యారు.
గోరంట్లలో ఐదుగురు, పాలసముద్రంలో ఇద్దరు, శెట్టిచిన్నంపల్లికి చెందిన ఓ మహిళ హిందూపురంలో ఫిజియోథెరపిస్టును సంప్రదించినట్లు గుర్తించారు. గోరంట్లలోని రెండు క్వారంటైన్ సెంటర్లలో మహిళలు, పురుషులను వేర్వేరుగా ఉంచారు. ప్రత్యేక వాహనంలో వైద్యులు ఇక్కడికే వచ్చి పరీక్షించి, శాంపిళ్లు తీసుకెళ్తారన్నారు. కొన్ని ప్రాంతాలను క్వారంటైన్ జోన్లుగా ఉంచి, రాకపోకలు నిషేధించినందున ఇళ్లలోనే ఉండాలని తహసీల్దార్ కోరారు. ఎవరైనా హిందూపురంలోని ఫిజియోథెరపీ క్లినిక్కు వెళ్లి ఉంటే వెంటనే తమను సంప్రదించాలని తెలిపారు.