కొవిడ్ కేర్ కేంద్రాల్లో 820 బెడ్లు
ABN , First Publish Date - 2022-01-22T05:25:45+05:30 IST
మూడో వేవ్ నేపథ్యంలో జిల్లాలో కొవిడ్ కేర్ కేంద్రాలను అధికార యంత్రాంగం ప్రారంభించింది.
పది చోట్ల ఏర్పాటు
ఒంగోలు (కలెక్టరేట్), జనవరి 21 : మూడో వేవ్ నేపథ్యంలో జిల్లాలో కొవిడ్ కేర్ కేంద్రాలను అధికార యంత్రాంగం ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒక కేంద్రం చొప్పున శుక్రవారానికి పది చోట్ల 820బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్ బారినపడి ఇంటిలో ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి వారికోసం ఈ కొవిడ్ కేర్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో చేరి వైద్యం పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశాలతో ఆయా పరిస్థితులకు అనుగుణంగా కేంద్రానికి 50 నుంచి 100 బెడ్ల వరకు ఏర్పాటు చేశారు. గురువారం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి 350 బెడ్లు అందుబాటులోకి తీసుకొని రాగా శుక్రవారం మరో ఆరు కేంద్రాలు తెరిచి మరో 470 బెడ్లను సిద్ధం చేశారు. ఆ కేంద్రాలకు నోడల్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్ల నియామకంతోపాటు ఇతర మానవనరులను కేటాయించారు. కొవిడ్ బారిన పడిన వారికి ఆ కేంద్రాల్లో భోజన వసతితోపాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.