దేశవ్యాప్తంగా 832 విమానాలు: కేంద్రం
ABN , First Publish Date - 2020-05-27T07:00:16+05:30 IST
దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించిన తొలి రోజు(సోమవారం) దేశవ్యాప్తంగా 832 విమానాలు
న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి): దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించిన తొలి రోజు(సోమవారం) దేశవ్యాప్తంగా 832 విమానాలు నడిచాయని, మొత్తం 58,318 మందిని గమ్యస్థానాలకు చేర్చాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. తొలిరోజు 532 విమానాలు నడిపామని సోమవారం సాయంత్రం ప్రకటించిన ఆయన, సోమవారం అర్ధరాత్రి వరకు 832 విమానాలు నడిచాయంటూ సవరించిన వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా, రెండో రోజూ(మంగళవారం) కొన్ని విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ సోమవారం నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించగా, తొలిరోజు ఏపీ, పశ్చిమబెంగాల్లలో విమాన సర్వీసులు నడవవని ఆదివారం రాత్రి కేంద్రం ప్రకటించింది. అలాగే, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో సోమవారం నుంచి ఆపరేషన్లు తక్కువగా ఉంటాయని తెలిపింది.