కరోనాను జయించిన 93 ఏళ్ల కేరళ వృద్ధుడు.. సీక్రెట్ ఏంటో చెప్పిన కుటుంబం..!

ABN , First Publish Date - 2020-04-02T18:34:23+05:30 IST

భారత్‌లో మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులను...

కరోనాను జయించిన 93 ఏళ్ల కేరళ వృద్ధుడు.. సీక్రెట్ ఏంటో చెప్పిన కుటుంబం..!

భారత్‌లో మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులను మొత్తంగా పరిశీలిస్తే.. ఈ కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారే ఉంటున్నారు. వయసు మీద పడిన తర్వాత మనిషిని సహజంగానే రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతుంటాయి. ఇలా రోగనిరోధక శక్తి ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వారికి కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్న మాట. అయితే.. కేరళలో 93 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. ఆరోగ్యకరమైన జీవన శైలే ఆయన తిరిగి కోలుకోవడానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. థామస్ అబ్రహం కుమారుడి కుటుంబం గత నెలలో ఇటలీ నుంచి వచ్చింది. వారి నుంచి థామస్‌కు, ఆయన భార్యకు కరోనా సోకింది.


దీంతో.. కొన్ని రోజుల క్రితం వారిద్దరూ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. 93 ఏళ్ల వయసున్నప్పటికీ థామస్ కరోనా నుంచి కోలుకోవడంపై ఆయన మనవడు రిజో చెప్పిన విషయాలు ఆసక్తి రేకెత్తించాయి. థామస్ వ్యవసాయం చేసేవారని, ఆయన మొదటి నుంచీ తినే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ వహించేవారని రిజో తెలిపాడు. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు లేవని చెప్పాడు. ఆయనకు జిమ్‌కు వెళ్లకుండానే సిక్స్ ప్యాక్ బాడీ ఉందన్నాడు. కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న థామస్ జీవనశైలి నేర్పే పాఠం ఏంటంటే... తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం, పౌష్టికాహారం తినడం, ఎటువంటి దురలవాట్లను దరిచేరనీయకుండా ఉంటే కరోనా వంటి వైరస్‌నైనా జయించవచ్చు.

Updated Date - 2020-04-02T18:34:23+05:30 IST