మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 97 మంది కరోనాతో మృతి
ABN , First Publish Date - 2020-05-27T03:37:06+05:30 IST
మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కరోనా కేసుల సంఖ్యతో పాటు...
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 97 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్లో ఒక్కరోజులో ఇంత మంది ఒక్క రాష్ట్రంలో కరోనా వల్ల మరణించడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ 97 మరణాల్లో 39 మరణాలు ముంబైలోనే నమోదు కావడం గమనార్హం.
మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 2,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో ఒక్క ముంబై నగరంలోనే 1,002 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,758కి చేరింది. మరణాల సంఖ్య 1,792కు చేరింది. ఈ 1,792 మరణాల్లో ముంబైలోనే 1,065 మరణాలు నమోదు కావడం గమనార్హం.