అయ్యో.. మరో చిన్నారి!
ABN , First Publish Date - 2021-09-17T09:04:30+05:30 IST
అర్ధరాత్రి నిద్ర నుంచి లేచి చూస్తే పక్కన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బిగ్గరగా ఏడుస్తూ ఇంట్లోంచి బయటకొచ్చిన తొమ్మిదేళ్ల ఏళ్ల బాలిక లైంగికదాడికి గురైంది.
- 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి
- 2 గంటల్లోనే అరెస్టు.. పోక్సో కింద కేసు
మంగళ్హాట్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి నిద్ర నుంచి లేచి చూస్తే పక్కన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బిగ్గరగా ఏడుస్తూ ఇంట్లోంచి బయటకొచ్చిన తొమ్మిదేళ్ల ఏళ్ల బాలిక లైంగికదాడికి గురైంది. తల్లిదండ్రులను వెతికిపెడతానని నమ్మించిన ఓ యువకుడు, ఆమెను నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రోజే హైదరాబాద్ హబీబ్నగర్లో ఈ దారుణం వెలుగుచూసింది. అదనపు డీసీపీ నరేందర్రెడ్డి వివరాలను వెల్లడించారు. మాంగార్ బస్తీలోని ఓ దంపతులకు నలుగురు పిల్లలు. దంపతులు తరచూ గొడవపడేవారు. భర్త మద్యానికి భార్యను కొట్టేవాడు. 15న (బుధవారం) రాత్రి గణేశ్ నిమజ్జనానికి వెళ్లొచ్చిన తర్వాత భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు నిమిత్తం ఆమె, హబీబ్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కౌన్సెలింగ్ నిమిత్తం భర్తను అక్కడికి పిలిపించారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి (9) అర్ధరాత్రి ఒంటిగంటకు మెలకువొచ్చి పక్కన చూడగా తల్లిదండ్రులిద్దరూ కనిపించలేదు. వాళ్ల కోసం ఇంటి నుంచి బయటకొచ్చింది. ఆ చిన్నారిని జులాయిగా తిరిగే అదే ప్రాంతానికి చెందిన సుమిత్ (19) అనే యువకుడు చూశాడు. తల్లిదండ్రుల ఆచూకీ చెబుతానని, చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి మల్లేపల్లివైపు తీసుకెళ్లాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి.. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఏడుస్తూ ఇంటికి చేరిన పాప
లైంగిక దాడి తర్వాత సుమిత్ ఆ బాలికను నిర్మాణంలో ఉన్న ఇంట్లో వదిలేసి పరారయ్యాడు. చిన్నారి, లోదుస్తులను చేతిలో పట్టుకొని ఏడుస్తూ బయటకు రావడంతో అక్కడున్న కొంత మంది యువకులు గమనించారు. వారి సాయంతో బాలిక అర్ధరాత్రి ఇంటికి చేరింది. అప్పటికే పోలీస్స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్న తల్లి, పాప కోసం వెతుకోంది. ఏడుస్తున్న కూతురు కనిపించేసరికి ప్రశ్నించగా తన పట్ల జరిగిన దారుణాన్ని వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంగళ్హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని భరోసా సెంటర్కు పంపించారు. అనంతరం హబీబ్నగర్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి రెండు గంటల్లోనే నిందితుడు సుమిత్ను అరెస్టు చేశారు. విచారణలో అతడు ఓ వాహనం దొంగతనం కేసులో నిందితుడని గుర్తించారు. స్థానికంగా జులాయిగా తిరుగుతూ గంజాయి, వైట్నర్ పీలుస్తుంటాడని పోలీసులు గుర్తించారు.