అమ్మా.. త్వరగా.. రా అన్నాడు.. వచ్చేసరికి చనిపోయాడు!
ABN , First Publish Date - 2021-04-05T14:30:09+05:30 IST
తల్లికి ఫోన్ చేసి అమ్మా.. త్వరగా ఇంటికి రా.. అని మాట్లాడాడు. ఆ సమయంలో
హైదరాబాద్/అంబర్పేట : అనుమానాస్పదస్థితిలో ఓ బాలుడు మృతి చెందాడు. అంబర్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన అశోక్, విజయమేరీ దంపతులకు కుమారుడు ఆశీర్వాద్ (15), కుమార్తె వున్నారు. అశోక్ ఖాళీగా ఉండగా విజయమేరీ కోఠిలోని ఓ ఆటో మొబైల్ షాప్లో పనిచేస్తోంది. ఈనెల 3 శనివారం సాయంత్రం ఆశీర్వాద్ తల్లికి ఫోన్ చేసి అమ్మా.. త్వరగా ఇంటికి రా.. అని మాట్లాడాడు. ఆ సమయంలో ఆశీర్వాద్ సోదరి తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది.
విజయ మేరీ రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా గది లోపల నుంచి గడియపెట్టి ఉంది. ఆశీర్వాద్ను ఎంత పిలిచినా తలుపు తెరవలేదు. విజయమేరీ స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇంట్లోని గదిలో ఆశీర్వాద్ పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతికి గల కారణాలు తెలియలేదు. విజయమేరీ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాల్వేరు మల్లేశం కేసు దర్యాప్తు చేస్తున్నారు.