చైనా కుట్రలకు కళ్ళెం!
ABN , First Publish Date - 2021-03-02T06:27:49+05:30 IST
గత ఏడాది దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ పవర్కట్ చవిచూడటం వెనుక చైనా హ్యాకర్ల చేతివాటం ఉన్నదన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి...
గత ఏడాది దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ పవర్కట్ చవిచూడటం వెనుక చైనా హ్యాకర్ల చేతివాటం ఉన్నదన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అక్టోబర్ 12న ఈ పవర్కట్తో ముంబైలో కీలకమైన కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. ఆస్పత్రులు కరోనా రోగులను రక్షించుకోవడానికి ఇబ్బందిపడ్డాయి. సరిహద్దు వివాదంలో భారత్ వెనక్కుతగ్గని పక్షంలో, దేశం మొత్తాన్ని అంధకారంలో ముంచేయగలమన్న హెచ్చరిక ఇందులో ఉన్నదనీ, చైనా ప్రభుత్వ ప్రోద్బలంమేరకే హ్యాకర్లు ఈ పనిచేశారని అమెరికాలోని రికార్డెడ్ఫ్యూచర్ సంస్థ అంటున్నది. విద్యుత్రంగంలో చైనా సంస్థల కాంట్రాక్టులను పూర్తిగా నిషేధించాలనీ, మరీముఖ్యంగా మాల్వేర్ ప్రయోగానికి అవకాశం ఉన్న చైనా డిజిటల్ ఎక్విప్మెంట్ వినియోగాన్ని నిలిపివేయాలని భారతప్రభుత్వం భావిస్తున్నట్టు నిజానికి ఆగస్టులోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమెరికా సంస్థ వెలుగులోకి తెచ్చిన చైనా సైబర్ దాడిలో నిజానిజాలను వెలికితీయడంతో పాటు, కీలకరంగాల్లో చైనాకు అడ్డుకట్టవేసే విషయంలో ఆవేశంతో ఊగిన మనం ఆ తరువాత ఏ మేరకు నిర్లక్ష్యం వహించిందీ సమీక్షించుకోవడం అవసరం.
వేణు రాంభట్ల