ఇలాంటి వింత ఐడియాలు మనోళ్లకే సాధ్యం.. బిర్యానీ వండే వంట పాత్రలో వధూవరులు.. ఫొటోషూట్ కాదండోయ్.. అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2021-10-19T22:26:13+05:30 IST
చుట్టూ నీళ్లు.. నీళ్ల మధ్యలో ఓ అల్యూమీనియం పాత్ర.. అందులో యువతి, యువకుడు.. వారి పక్కనే ఫొటో గ్రాఫర్. ఇదంతా చూసి ఫొటోషూట్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో చా
ఇంటర్నెట్ డెస్క్: చుట్టూ నీళ్లు.. నీళ్ల మధ్యలో ఓ అల్యూమీనియం పాత్ర.. అందులో యువతి, యువకుడు.. వారి పక్కనే ఫొటో గ్రాఫర్. ఇదంతా చూసి ఫొటోషూట్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో చాలా మంది ఇదంతా ఫొటోషూట్ కోసం వేసిన సెటపనే అనుకుంటున్నారు. తీరా విషయం తెలుసుకుని కంగుతింటున్నారు. ఇలాంటి వింత ఐడియాలు మనోళ్లకే సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన ఆకాశ్, ఐశ్వర్య స్థానికంగా హెల్త్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా వల్ల వారి వివాహం వాయిదా పడింది. ఈ క్రమంలోనే సోమవారం నాడు ఆకాశ్, ఐశ్వర్యకు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధు మిత్రులను కూడా ఆహ్వానించేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబ సభ్యులతో సహా వధూవరులు కళ్యాణమండపం పరిసర ప్రాంతంలోని ఓ టెంపుల్కు రెండు రోజుల ముందుగానే చేరుకున్నారు.
కాగా.. రెండ్రోజుల్లో పెళ్లి అనగా కేరళలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రోడ్లన్నీ వరద నీటితో జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా మరోసారి పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక.. వధూవరులు ఇద్దరూ బిర్యానీ వండే పత్రాలో కూర్చుని, వరద నీటిని దాటి, పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఇదే సమయంలో వరదలపై రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధి.. ఆ వధూవరుల ఫొటోను తీయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్గా మారింది. దీంతో ఆ వధూవరుల ఫొటోను చూసి మొదటగా ఫొటోషూట్ అనుకుని.. ఆ తర్వాత విషయం తెలుసుకుని విస్తుపోతున్నారు. అంతేకాకుండా ‘ఇలాంటి వింత ఐడియాలు మనోళ్లకే సాధ్యం’ అంటూ కామెంట్ చేస్తున్నారు.