ఒడిశా సీఎంకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన చెఫ్

ABN , First Publish Date - 2021-10-17T20:39:38+05:30 IST

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ 76వ జన్మదినోత్సవాల

ఒడిశా సీఎంకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన చెఫ్

భువనేశ్వర్ : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ 76వ జన్మదినోత్సవాల సందర్భంగా రాకేశ్ కుమార్ సాహు అనే చెఫ్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. హాకీకి అండగా నిలుస్తున్నందుకు మెచ్చుకుంటూ, చాకొలెట్‌తో నవీన్ విగ్రహాన్ని తయారు చేశారు. 72 కేజీల బరువున్న ఈ విగ్రహాన్ని క్రీడల శాఖ మంత్రి తుషార్ కాంతి బెహరా ఆవిష్కరించారు.


నవీన్ పట్నాయక్ తన జన్మదినోత్సవాలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన రాకేశ్ కుమార్ సాహు (32) బేకింగ్, పేస్త్రీ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్నారు. ఆయనకు క్రీడలంటే మక్కువ ఎక్కువ. అనేక సంవత్సరాల నుంచి భారత హాకీ జట్టుకు అండదండలు అందిస్తున్న నవీన్ పట్నాయక్ పట్ల అభిమానం పెంచుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించినపుడు, భారత మహిళల హాకీ జట్టు అద్భుతంగా ఆడినపుడు ఆయన చాలా సంతోషించారు. 


నవీన్ పట్నాయక్ జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించాలని అనుకున్నానని రాకేశ్ చెప్పారు. చాకొలెట్‌తో నవీన్ విగ్రహాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే తన విద్యార్థులకు చెప్పానన్నారు. దీనికి సాయపడేందుకు వారు కూడా అంగీకరించారన్నారు. 72 కేజీల బరువైన విగ్రహాన్ని తయారు చేయడానికి 15 రోజులు పట్టిందన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ చాలా శ్రమతో దీనిని తయారు చేశామని తెలిపారు. గదిలో ఉష్ణోగ్రత, తేమ స్థాయులు మారుతుండటంతో తాము ఆందోళన చెందామన్నారు. చివరికి తమ శ్రమకు తగిన ఫలితం వచ్చిందని చెప్పారు. 


ఈ విగ్రహాన్ని నవీన్ పట్నాయక్ జన్మదినోత్సవాల సందర్భంగా క్రీడల శాఖ మంత్రి తుషార్ కాంతి బెహరా కళింగ హాకీ స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి ఆర్ వినీల్ కృష్ణ, ఒడిశా హాకీ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ దిలీప్ టిర్కే, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ విగ్రహానికి ఉపయోగించిన చాకొలెట్‌ను సమీప ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తున్న బాలలకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. 


Updated Date - 2021-10-17T20:39:38+05:30 IST