26 ఏళ్ల పాటు... 200 హియరింగ్స్ తర్వాత రైతుకు విముక్తి

ABN , First Publish Date - 2021-11-24T21:07:22+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌ రైతు మహమ్మద్ సలావుద్దీన్ (62)

26 ఏళ్ల పాటు... 200 హియరింగ్స్ తర్వాత రైతుకు విముక్తి

మీరట్ : ఉత్తర ప్రదేశ్‌ రైతు మహమ్మద్ సలావుద్దీన్ (62)కు 26 ఏళ్ళ తర్వాత ఓ కేసు నుంచి విముక్తి లభించింది. తన బంధువులు తనపై శత్రుత్వంతో ఈ కేసు నమోదు చేయించారని ఆయన చేసిన వాదనలకు 200 విచారణల తర్వాత ఫలితం దొరికింది. ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొంది. 


ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లి గ్రామస్థుడు సలావుద్దీన్‌కు 10 సెంట్ల భూమి ఉంది. ఆయన వద్ద నాలుగు 12 బోర్ తూటాలు ఉన్నాయని ఆరోపిస్తూ ముజఫర్ నగర్ పోలీసులు 1995లో ఆయుధాల చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు తప్పు అని, అవాస్తవమని, తన బంధువులు తనపై శత్రుత్వంతో ఈ కేసు నమోదు చేయించారని సలావుద్దీన్ వాదించారు. ఆయన 1995లో అరెస్టయ్యారు. 20 రోజులపాటు జైలు జీవితం గడిపారు. 


ఈ కేసు వల్ల తన జీవితమంతా కోర్టుల్లోనే గడిచిపోయిందని సలావుద్దీన్ వాపోయారు. తన ఆదాయమంతా ఈ కేసు కోసమే ఖర్చు చేయవలసి వచ్చిందని తెలిపారు. 


పోలీసులు ఈ కేసులో సాక్ష్యాధారాలను సమర్పించలేదని, ఆ హక్కును 2019లో వదులుకున్నారని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. సలావుద్దీన్‌కు ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు. 


Updated Date - 2021-11-24T21:07:22+05:30 IST