మాస్క్ లేకుంటే రూ.100 జరిమానా
ABN , First Publish Date - 2021-04-21T06:34:11+05:30 IST
మాస్క్ ధరించకుంటే రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది.
కలికిరి, ఏప్రిల్ 20: మాస్క్ ధరించకుంటే రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది. ఇప్పటి వరకూ స్థానిక అధికారుల నిర్ణయం మేరకు రూ.50 నుంచి 200 వరకూ విధించే రకరకాల జరిమానాలకు ప్రభుత్వం చరమగీతం పలికింది. ప్రభుత్వమే రూ.వంద జరిమానా విధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వీటి బాధ్యతను డ్యూటీలోని పోలీసులందరికీ అప్పగించారు. అమలు బాధ్యతను కలెక్టరుకు ఇచ్చారు. నోరు, ముక్కు పూర్తిగా మాస్క్తో కప్పి ఉండాలని స్పష్టంచేసింది. దుకాణాలు తదితర గుమికూడే ప్రదేశాల్లో ప్రజలచేత మాస్క్ ధరింపజేసే బాధ్యత నిర్వాహకులదేనని తేల్చి చెప్పింది. అలాగే, బహిరంగ ప్రదేశాలతోపాటు జనం గుమికూడే అవకాశమున్న చోట తప్పనిసరిగా ఐదడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. కల్యాణ మండపాలు, థియేటర్లలాంటి కూర్చోవడానికి సీట్లున్న చోట సీటు మార్చి సీటు ఖాళీగా ఉంచాలని తెలిపింది. ఇక్కడ కూడా శానిటైజర్ సమకూర్చడం, మాస్క్ ధరించడం తప్పని సరిగా పేర్కొంది. థర్మల్ స్ర్కీనింగ్, శానిటైజేషన్, ఐదడుగుల భౌతిక దూరం కూడా పాటించాలని సూచించింది. స్విమ్మింగ్ పూల్స్ను తక్షణం మూసేయాలని పేర్కొంది. ఇవన్నీ తక్షణం అమల్లోకి తీసుకురావాలని కలెక్టరును ప్రభుత్వం ఆదేశించింది.