మానవత్వాన్ని చాటుకున్న మిత్రుడు
ABN , First Publish Date - 2022-01-28T05:00:44+05:30 IST
కరోనాతో అయినవాళ్లే దూరంగా ఉంటున్న వేళ తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన ఓ వ్యక్తికి బాల్యమిత్రుడు అంత్యక్రియలు నిర్వహించాడు.
అనాథగా మిగిలిన స్నేహితుడి మృతదేహానికి అంత్యక్రియలు
నల్లగొండ జిల్లా వేములపల్లిలో ఘటన
వేములపల్లి, జనవరి 27 : కరోనాతో అయినవాళ్లే దూరంగా ఉంటున్న వేళ తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన ఓ వ్యక్తికి బాల్యమిత్రుడు అంత్యక్రియలు నిర్వహించాడు. మానవీయతను చాటుకున్న ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన నెమ్మోజు జానయ్యచారి(54) వృత్తిరీత్యా కార్పెంటర్. 1983లో పదో తరగతి 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతాడు. ఉన్నత చదువులకు వెళ్లే స్తోమత లేక కులవృత్తి చేయలేక మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడిగా మారిపోయాడు. కొన్నేళ్లకు తల్లిదండ్రులు కన్నుమూశారు. ఆ తరువాత ఆదరించే వారు లేక అనాథయ్యాడు. సొంత ఊరితోపాటు మండల పరిసర గ్రామాల్లో సంచరిస్తూ కొన్ని సందర్భాల్లో ఏదో తనకు తోచిన పనిచేస్తూ జీవనం సాగించేవాడు. బాల్యమిత్రులు ఉన్నా ఎవరినీ సాయమడిగే వాడు కాదు. రాత్రనక, పగలనక ఎంతదూరమైనా కాలినడకన సంచరించేవాడు. ఈ నెల 26వ తేదీ రాత్రి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పంటపొలాల్లో జానయ్యచారి అకాల మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జానయ్య బాల్యస్నేహితుడు, స్థానిక సర్పంచ్ నామిరెడ్డి కరుణాకర్రెడ్డి గ్రామానికి చెందిన మరికొందరు గ్రామ పెద్దలు పందుల సైదులు, హరీష్, నారబత్తుల, కానుగు రాములు, పాలకూరి శ్రీను, యువకుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. పంచాయతీ ట్రాక్టర్లో తీసుకెళ్లి గ్రామశివారులో సిబ్బంది సహకారంతో ఖననం చేశారు. గ్రామస్థులు, పలువురు సర్పంచ్ ఉదారతను కొనియాడారు.