ప్రజలను దోచుకునే మాస్టర్‌ప్లాన్‌

ABN , First Publish Date - 2021-07-30T04:43:25+05:30 IST

ప్రజలను దోచుకోవడానికే వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ - 2041 తయారు చేశారని, దానిని రద్దు చేసి కొత్తది రూపొందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ప్రజలను దోచుకునే మాస్టర్‌ప్లాన్‌
వీఎంఆర్‌డీఏ ముందు ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

కొత్తది తయారు చేయాలి

టీడీపీ నాయకుల డిమాండ్‌

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రజలను దోచుకోవడానికే వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ - 2041 తయారు చేశారని, దానిని రద్దు చేసి కొత్తది రూపొందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. పార్టీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ నేతృత్వంలో వీఎంఆర్‌డీఏ కార్యాలయం ముందు గురువారం సాయంత్రం ధర్నా చేశారు. అనంతరం కార్యదర్శి రఘునాథరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొత్త మాస్టర్‌ప్లాన్‌ తయారుచేసిన తరువాత అభ్యంతరాలు  తెలపడానికి కనీసం మూడు నెలలు గడువు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత ప్లాన్‌ ఇంగ్లిష్‌లో ఉందని, తెలుగులో ఈసారి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగా వేసే రహదారుల గురించి ఆయా ప్రాంతాల్లో దండోరా వేయాలని, ప్రజలకు గ్రామసభల ద్వారా తెలియజేయాలన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ ప్లాన్‌ లోపభూయిష్టంగా ఉందని, విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో దీనిని రూపొందించారని ఆరోపించారు. దీని వల్ల పేద, మధ్య తరగతి వారితో పాటు ధనికులు కూడా నష్టపోతారన్నారు. ప్లాన్‌ పేరుతో ప్రజలను వేధించి దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించారన్నారు. డబ్బులు దండుకునే అవకాశం ఉన్న ఈ ప్లాన్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-07-30T04:43:25+05:30 IST