హోం క్వారంటైన్లో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి.. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో..
ABN , First Publish Date - 2020-05-28T17:12:34+05:30 IST
గూడెంకొత్తవీధి మండలం సీలేరులో హోం క్వారంటైన్లో వున్న ఏపీ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ కె.శ్రీనివాసరావు(41) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శ్రీనివాసరావు 2017 డిసెంబరు నుంచి సీలేరులో
సీలేరు (విశాఖ పట్టణం): గూడెంకొత్తవీధి మండలం సీలేరులో హోం క్వారంటైన్లో వున్న ఏపీ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ కె.శ్రీనివాసరావు(41) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శ్రీనివాసరావు 2017 డిసెంబరు నుంచి సీలేరులో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుటుంబం రాజమహేంద్రవరంలో నివాసం ఉంటోంది. మార్చి 21న కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లిన ఆయన లాక్డౌన్ కారణంగా ఈ నెల 20 వరకు అక్కడే ఉండిపోయారు. 21న సీలేరు చేరుకున్న ఆయన్ను హోం క్వారంటైన్లో వుండాలని స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ఆదేశించారు. అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్న శ్రీనివాసరావు మూడు రోజులుగా ఫోన్ చేయకపోవడంతో తన భర్త ఎలా వున్నారో చూడాలంటూ ఆయన భార్య బుధవారం సహోద్యోగులకు ఫోన్ చేశారు. వారు...ఆయన ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టినా ఎటువంటి సమాధానం లేదు.
ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నట్టు గమనించిన జెన్కో ఉద్యోగులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ నీలకంఠం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో తలుపులను పగులకొట్టించి లోపలకు వెళ్లి పరిశీలించగా శ్రీనివాసరావు బెడ్రూమ్లో మంచంపై విగతజీవిగా కనిపించారు. శ్రీనివాసరావు జల విద్యుత్ కేంద్రం ఎంసీఆర్లో షిఫ్ట్ ఏఈగా విధులు నిర్వహించేవారని, ఆయన భార్య రాజమహేంద్రవరంలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హోం క్వారంటైన్లో వున్న శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వైద్యఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం చేశారని జెన్కో ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై వైద్యాధికారిని వివరణ కోరగా సోమవారం శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టినా తలుపులు తియ్యకపోవడంతో వెనక్కి వచ్చే శామని, ఆ తరువాత అక్కడికి వెళ్లలేదని తెలిపారు. అయితే మద్యం అధికంగా తీసుకోవడం వల్ల శ్రీనివాసరావు నిద్రలోనే మృతిచెంది వుంటారని భావిస్తున్నట్టు ఎస్ఐ నీలకంఠం పేర్కొన్నారు.