మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని తప్పించిన ఎన్ఆర్ఐ దాతృత్వం

ABN , First Publish Date - 2021-06-04T00:50:20+05:30 IST

కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన బెక్స్ కృష్ణన్ (45

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని తప్పించిన ఎన్ఆర్ఐ దాతృత్వం

కొచ్చి : కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన బెక్స్ కృష్ణన్ (45) చాలా సంతోషంగా ఉన్నారు. ఓ దాత వల్ల తనకు పునర్జన్మ లభించిందని, ఇక చూడలేననుకున్న తన కుటుంబ సభ్యులను చూడబోతున్నానని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోషానికి కారకుడైన దాతను వెంటనే కలిసి, ధన్యవాదాలు చెప్పాలని ఎదురు చూస్తున్నారు. 


కృష్ణన్ అబుదాబిలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేవారు. 2012 సెప్టెంబరులో ముసఫా వెళ్తుండగా, ఆయన నడుపుతున్న కారు అదుపు తప్పి, రోడ్డుపక్కన ఆడుకుంటున్న బాలలపైకి దూసుకెళ్ళింది. ఓ సూడాన్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఆయనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుప్రీంకోర్టు 2013లో మరణ శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన అబుదాబి జైలులో విచారంగా కాలం గడుపుతున్నారు. 


కృష్ణన్ కుటుంబ సభ్యులు అనేక విధాలుగా ఆయనను కాపాడేందుకు ప్రయత్నించారు. చివరికి బీజేపీ నేత సేతుమాధవన్ సహాయంతో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్ అలీని కలిశారు. కృష్ణన్‌కు సహాయపడేందుకు అలీ అంగీకరించారు. ఈలోగా ప్రాణాలు కోల్పోయిన బాలుని కుటుంబం తిరిగి సూడాన్ వెళ్ళిపోయింది. 


బాధిత కుటుంబాన్ని తిరిగి అబుదాబికి రప్పించారు. కృష్ణన్‌ను క్షమించేందుకు 2021 జనవరిలో బాధిత కుటుంబం అంగీకరించింది. దీంతో వారికి అలీ 5 లక్షల దిర్హామ్‌లు (సుమారు రూ.1 కోటి) నష్టపరిహారం చెల్లించారు. త్వరలోనే కృష్ణన్ విడుదలవుతారని ఆయన బంధువులు చెప్పారు. కృష్ణన్ జైలు నుంచి విడుదలై, తిరిగి కేరళ వస్తారని చెప్పారు. 


కృష్ణన్‌కు ఔట్ పాస్ మంజూరు చేసేందుకు ఆయనను ఇండియన్ ఎంబసీ అధికారులు కలిశారు. ఇది తనకు పునర్జన్మ అని కృష్ణన్ వారితో చెప్పారు. 


Updated Date - 2021-06-04T00:50:20+05:30 IST