వీడని ముసురు

ABN , First Publish Date - 2022-07-14T05:35:08+05:30 IST

జిల్లాను ముసురు వీడటం లేదు. వారం రోజులుగా మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది.

వీడని ముసురు
భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో గుంతలమయమైన రోడ్డు

11.9మి.మీ సగటు వర్షపాతం నమోదు

యాదాద్రి, జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లాను ముసురు వీడటం లేదు. వారం రోజులుగా మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా సగటున 11.9మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆలేరు మండలంలో 18.8మి.మీ, అత్యల్పంగా చౌటుప్పల్‌లో 3.0మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తరువాత తుర్కపల్లి, గుండాల, బొమ్మలరామారం మండలాల్లో 18.6మి.మీ, రాజపేటలో 17.4మి.మీ, మోత్కూరులో 15మి.మీ సగటు వర్షం కురిసిం ది. మిగతా ప్రాంతాల్లో రోజంతా చిరుజల్లులు కురిశాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జాతీయ రహదారులతోపాటు లింకురోడ్లపై నీరు నిలిచి గుంతలు పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వీధులు చిత్తడి గా మారాయి. రాయిగిరి-మోత్కురు, కాటేపల్లి-ముత్తిరెడ్డిగూడెం, పోచంపల్లి-రేవణపల్లిరోడ్డు, వలిగొండ-గోకారం, మోత్కురు-అడ్డగుడూరు, ము త్తిరెడ్డిగూడెం-గంగసానిపల్లి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్కో చోట మూడు కిలోమీటర్ల పొడవున రహదారులు గుంతలమయమయ్యాయి. భువనగిరి మునిసిపాలిటీలో పలుచోట్ల బీటీ రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. జిల్లాలో లక్షఎకరాల్లో పత్తి పంట సాగుకాగా, ముసురు కారణంగా చేల ల్లో నీరు నిలిచింది. భువనగిరి మండలం వీరవెల్లి లో పత్తిపంట నీటమునిగింది. మోటకొండూరు,ఆలేరు, గుట్ట, తదితర మండలాల్లో పొలాలను వరద ముంచెత్తింది. హైదరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వలిగొండ మండలం సంగెం, పోచంపల్లి మండలం పిలాయిపల్లి వద్ద మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి.

Updated Date - 2022-07-14T05:35:08+05:30 IST