కరోనా వార్డులకు ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-08-11T10:11:24+05:30 IST
కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిర్వహిస్తున్న వార్డులకు వచ్చి వెళ్లే ప్రజలకు ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎంవీ.
భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ఎంవీ. రెడ్డి
ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిర్వహిస్తున్న వార్డులకు వచ్చి వెళ్లే ప్రజలకు ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎంవీ. రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. సాధారణ వార్డు, ఆస్పత్రి పరిసరాలు, ప్రసూతి కేంద్రం, కరోనా వ్యాధి చికిత్సలు నిర్వహిస్తున్న వార్డులను కలెక్టర్ పరిశీలన చేశారు. ఆస్పత్రిలో కరోనా వ్యాధి చికిత్సలు నిర్వహిస్తున్న వార్డు ప్రక్కనే ఉన్న ప్రసూతి వార్డు ఉండటం చిన్నారులకు, తల్లులకు కూడా అంతమంచిది కాదన్నారు.
కొత్తగూడెం ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి సమగ్ర నివేదికలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ సీతాలక్ష్మీ, అదనపు కలెక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, పర్యవేక్షకులు సరళ, జిల్లా వైద్యాధికారి భాస్కర్, ఆర్ఎంఓ రవిబాబు, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగినందున అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు అనుమానిత లక్షణాలుంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ఎంవీ. రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా వ్యాధి సోకినట్లు తెలుసుకున్న కలెక్టర్ సెక్షన్ను పరిశీలించి సిబ్బందితో ముఖాముఖీగా మాట్లాడి వ్యాధి సోకుతుందని భయభ్రాంతులకు గురికావద్దని సిబ్బందికి ధైర్యంకల్పించారు.
అన్ని ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు
ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించాలని ప్రభుత్వం జిల్లాలోని అన్ని ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంవీ. రెడ్డి తెలిపారు. సోమవారం పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలకు భూ కేటాయింపులు, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు పెంపకం తదితర అంశాలపై అటవీ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవో, ఏపీఎంలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు తహసీల్దార్లు అప్పగించిన భూముల్లో తక్షణం పనులు ప్రారంభించాలని జాప్యం చేస్తే అందుకు బాధ్యులు ఎంపీడీవోలు, ఎంపీవోలేనని ఆయన చెప్పారు.