ఇసుక తిన్నెల్లో సూపర్‌బగ్... ముంచుకొస్తున్న మరో మహమ్మారి...

ABN , First Publish Date - 2021-03-19T00:54:27+05:30 IST

మన దేశంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇసుక తిన్నెల్లో ఓ సూపర్‌బగ్

ఇసుక తిన్నెల్లో సూపర్‌బగ్... ముంచుకొస్తున్న మరో మహమ్మారి...

న్యూఢిల్లీ : మన దేశంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇసుక తిన్నెల్లో ఓ సూపర్‌బగ్ కనిపించింది. దీనిని అంతం చేయడం కానీ, దీని వృద్ధిని ఆపడం కానీ దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ఇది కోవిడ్-19 మహమ్మారి తర్వాత ముంచుకొస్తున్న మరో మహమ్మారి కాబోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. 


ఎంబయో అనే జర్నల్‌లో మంగళవారం ప్రచురితమైన అధ్యయనం వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాన యాంటీ ఫంగల్ ట్రీట్‌మెంట్స్‌ను తట్టుకుని మనుగడ సాగించగలిగే సూపర్‌బగ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని కెండిడా ఆరిస్ లేదా సీ ఆరిస్ అని కూడా పిలుస్తారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఈ సూపర్‌బగ్ విస్తృతంగా వ్యాపించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్లు ఓ ఎక్స్‌పర్ట్ చెప్పారు. 


అండమాన్ దీవుల నుంచి...

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అనురాధ నేతృత్వంలోని బృందం ఓ అధ్యయనం నిర్వహించింది. అండమాన్ దీవుల్లోని ఎనిమిది సహజ ప్రదేశాల నుంచి సేకరించిన 48 ఇసుక, నీటి నమూనాలను పరీక్షించింది. వీటిని ఇసుక తీరాలు, రాతి నేలలు, చిత్తడి నేలలు, మడ అడవుల నుంచి సేకరించారు. మానవ సంచారం లేనటువంటి ఉప్పు చిత్తడి నేల నుంచి సేకరించిన సీ ఆరిస్‌ను, మానవ సంచారం ఎక్కువగా ఉండే ఓ బీచ్ నుంచి సేకరించిన సీ ఆరిస్‌ను వేర్వేరుగా ఉంచి పరిశోధనలు జరిపారు. 


మానవ సంచారం ఎక్కువగా ఉండే బీచ్ నుంచి సేకరించిన సీ ఆరిస్‌ చాలా పటిష్టంగా ఉందని, దీనిని అంతం చేయడానికి లేదా వృద్ధిని ఆపడానికి అనేక మందులను వాడినప్పటికీ ఫలితం లేని స్థితిలో ఉందని డాక్టర్ చౌదరి చెప్పారని ‘లైవ్ సైన్స్’ పేర్కొంది. జన సంచారం లేని చిత్తడి నేల నుంచి సేకరించిన సీ ఆరిస్ నెమ్మదిగా వృద్ధి చెందుతోందని గమనించినట్లు తెలిపారని పేర్కొంది. దీనికి మందులను తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు చెప్పారని తెలిపింది. మిగిలిన చోట్ల నుంచి సేకరించిన సీ ఆరిస్‌తో పోల్చితే ఇది అధిక ఉష్ణోగ్రతగల వాతావరణంలో చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతున్నట్లు పరిశోధకులు గమనించారు. 


సీ ఆరిస్ సహజంగానే అండమాన్ దీవుల్లో ఉంటుందా? అది అక్కడే మొదలైందా? అనే అంశాలను ఈ అధ్యయనం నిరూపించలేదు. బీచ్‌కు వెళ్ళిన జనం నుంచే ఇది వచ్చి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. 


జ్వరం వచ్చే వరకు గుర్తించడం అసాధ్యం

సీ ఆరిస్ (సూపర్‌బగ్) మానవుడి శరీరంపై గాయాల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఈ విధంగా శరీరంలోకి వెళ్ళడానికి ముందు చర్మంపై కొంతసేపు ఉండగలదు. ఇది రక్తంలో ప్రవేశించిందంటే, తీవ్రమైన అస్వస్థతకు దారి తీస్తుంది, ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఇన్ఫెక్షన్ వల్ల ప్రపంచంలో ఏటా 11 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 


ఈ సూపర్‌బగ్ సోకినవారిలో ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. జ్వరం, జలుబు వచ్చిన తర్వాత మాత్రమే దీని లక్షణాలు బయటపడతాయి. మందులు వాడినప్పటికీ ఈ లక్షణాలు కొనసాగుతాయని, మరణానికి కూడా దారి తీయవచ్చునని  తెలుస్తోంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూపర్‌బగ్ వల్ల తీవ్రమైన బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కెథెటర్స్, ఫీడింగ్ ట్యూబ్స్, బ్రీతింగ్ ట్యూబ్స్ అవసరమైన రోగులపై దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. 


ఎలా వ్యాపిస్తుంది?

సీ ఆరిస్ సూపర్‌బగ్ ఎలా వ్యాపిస్తుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. వాతావరణ మార్పుల వల్ల పెరిగిన ఉష్ణోగ్రతలకు ఈ సూపర్‌బగ్ అలవాటు పడిందని గతంలో శాస్త్రవేత్తలు ఊహించారు. మానవుడి సాధారణ శరీర ఉష్ణోగ్రతకు అలవాటు పడినట్లు అంచనా వేశారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రపంచంలో దావానలంలా వ్యాపిస్తోందని, గుంపుగా ఒక చోట చేరే మానవుల ద్వారా ఇది వ్యాపిస్తోందని భావిస్తున్నారు. 


పదేళ్ళ క్రితమే కనిపించింది

సీ ఆరిస్ మొదటిసారి 2009లో జపాన్‌లో ఓ రోగిలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రుల్లో దీనిని గుర్తించారు. 2019నాటికి బ్రిటన్‌లో దాదాపు 270 మందిలో ఇది ఉందని కనుగొన్నారు. వీరిలో ఎనిమిది మంది మరణించినప్పటికీ, వారి మరణానికి కారణం ఈ ఫంగసేనని చెప్పడం సాధ్యం కాదని పరిశోధకులు చెప్తున్నారు. 


తదుపరి మహమ్మారి సిద్ధం?

కెనడాలోని మెక్ గిల్ విశ్వవిద్యాలయం, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డొనాల్డ్ షెపర్డ్ 2020లో సమర్పించిన నివేదిక ప్రకారం, లండన్‌లో మధుమేహంతో బాధపడేవారి కాళ్ళలో అల్సర్లలో సీ ఆరిస్ కనిపించింది. ఇది భారత దేశంలో కూడా కనిపించింది. దీంతో శాస్త్రవేత్తలు తమ దృష్టిని తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణమయ్యే రోగ కారకాలపైకి మళ్ళించారు. 


Updated Date - 2021-03-19T00:54:27+05:30 IST