రూ. 18 లక్షల స్కామ్‌ను కనిపెట్టిన భారతీయుడు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-02-18T03:41:08+05:30 IST

భారతదేశానికి చెందిన రాజ్బీర్ సింగ్ అనే క్యాబ్ డ్రైవర్ 25 వేల డాలర్ల స్కామ్‌ను చేధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.

రూ. 18 లక్షల స్కామ్‌ను కనిపెట్టిన భారతీయుడు.. అమెరికాలో..

కాలిఫోర్నియా: భారతదేశానికి చెందిన రాజ్బీర్ సింగ్ అనే క్యాబ్ డ్రైవర్ 25 వేల డాలర్ల స్కామ్‌ను చేధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరంగా చెప్పాలంటే.. కాలిఫోర్నియాలోని రోజ్‌విల్లే ప్రాంతంలో గత వారం 92 ఏళ్ల వృద్దురాలు రాజ్బీర్ క్యాబ్ ఎక్కింది. దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్లి 25 వేల డాలర్ల(రూ. 17 లక్షల 83 వేలు)ను విత్ డ్రా చేయాలని రాజ్బీర్‌కు వృద్దురాలు చెప్పింది. ఇంటర్నల్ రివెన్యూ సర్వీస్‌కు ఆ డబ్బులను చెల్లించాలంటూ వివరించింది. అయితే వృద్దురాలు చెప్పిన మాటలు రాజ్బీర్‌కు అనుమానం కలిగించాయి. ఎవరో ఆమెను మోసం చేసి ఆ డబ్బును కాజేయాలని చూస్తున్నట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే వృద్దురాలికి ఈ విషయం చెప్పగా.. ఆమె నమ్మలేదు. రాజ్బీర్ ఆమెను మోసం చేస్తున్నాడని అనుకుంది. 


వృద్దురాలు మోసపోకుండా ఉండేందుకు.. రాజ్బీర్ తన క్యాబ్‌ను పోలీస్ స్టేషన్‌కు తిప్పాడు. వృద్దురాలు చెప్పిన మాటలను పోలీసులకు చెప్పాడు. పోలీసులు వివరంగా వృద్దురాలితో స్కామ్ గురించి చెప్పగా.. ఎవరో మోసం చేస్తున్న విషయాన్ని వృద్దురాలు గ్రహించింది. వృద్దురాలు ఓ ఫోన్ నెంబర్ ఇవ్వగా.. ఆ నెంబర్‌కు రాజ్బీర్ కాల్ చేశాడు. వృద్దురాలు ఎవరో తెలీదంటూ ఫోన్ పెట్టేశాడు. మరోమారు చేస్తే ఏకంగా ఆ నెంబర్‌ను బ్లాక్ చేసినట్టు రాజ్బీర్ చెప్పుకొచ్చాడు. కాగా.. రాజ్బీర్ లేకుంటే వృద్దురాలి డబ్బును కాజేసేవారని పోలీసులు తెలిపారు. రాజ్బీర్‌ చేసిన పనికి ప్రోత్సాహకంగా 50 డాలర్ల గిఫ్ట్ కార్డ్‌ను పోలీసులు అందజేశారు.

Updated Date - 2020-02-18T03:41:08+05:30 IST