స్నేహితుల పర్యటన విషాదాంతం
ABN , First Publish Date - 2021-08-02T07:41:55+05:30 IST
స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితుల పర్యటనలు విషాదాంతాలయ్యాయి.
ఎస్సారెస్పీలో ముగ్గురు యువకుల గల్లంతు
వాజేడు/నందిపేట/నిజామాబాద్, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితుల పర్యటనలు విషాదాంతాలయ్యాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం ఈ సంఘటనలు జరిగాయి. నిజామాబాద్లోని అర్సపల్లికి చెందిన అసది ఉదయ్(20), బూర్గుల రాహుల్(21), గట్టు శివగణేష్(22), సాయికృష్ణ, రాజేందర్, రోహిత్ మూడు బైక్ల పైన నిజామాబాద్ జిల్లా నందిపేట మండ లం గంగగడ్డ నడికుడ గ్రామం సమీపంలోని ఎస్సారెస్సీ బ్యాక్ వాటర్ను చూసేందుకు వెళ్లారు. చేతులు కడుక్కునేందుకు వెళ్లిన శివగణేష్ నీటిలో మునిగిపోగా.. అతన్ని కాపాడేందుకు రాహుల్, ఉద య్ ప్రయత్నించి.. వారూ మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సాయికృష్ణ, రాజేందర్ ప్రయత్నిస్తూ మునిగిపోతుండగా ఒడ్డుపై ఉన్న రోహిత్ కేకలు పెట్టాడు. దీంతో పక్కనే ఉన్న పెద్ద రాజేశ్వర్ అనే వ్యక్తి వచ్చి వారిద్దరిని కాపాడారు. గల్లంతయిన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. మరో ఘటనలో భూపాలపల్లి జిల్లాలోని దొసపాటిలొద్ది జలపాతం వద్దకు వచ్చిన సింగరేణి థౌజండ్ క్వార్టర్స్ కాలనీకి చెందిన మునిగెల నరేష్(24) నీటిలో ముని గి గల్లంతయ్యాడు. అలాగే, సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన వడ్ల రవికుమార్ (30) స్నేహితులతో కలిసి దొసపాటిలొద్ది జలపాతం వద్దకు వచ్చాడు. జలపాతం పక్క నుంచి నీటిలో దిగగా జారిపడి గల్లంతయ్యాడు. స్థానిక యువకులు గాలించినప్పటికీ రాత్రి వరకూ వారిద్దరి ఆచూకీ లభ్యం కాలేదు.