కాకర్ల చెరువును పరిశీలించిన త్రిసభ్య కమిటీ
ABN , First Publish Date - 2021-01-21T06:18:11+05:30 IST
చిన్నదూగాం పరిధిలోని కాకర్ల చెరువు ఆక్రమణలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) త్రిసభ్య కమిటీ బుధవారం పరిశీలించింది. సర్వే నెం.59లో 12.75 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పటికే ఆలయం, ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయ భవనంతోపాటు పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించారు.
జలుమూరు, జనవరి 20 : చిన్నదూగాం పరిధిలోని కాకర్ల చెరువు ఆక్రమణలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) త్రిసభ్య కమిటీ బుధవారం పరిశీలించింది. సర్వే నెం.59లో 12.75 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పటికే ఆలయం, ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయ భవనంతోపాటు పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. దీంతో పాటు మరికొందరు ఆక్రమణలకు పాల్పడడంపై గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీలో పిటీషన్ వేసింది. చెరువు ఆక్రమణలతో పర్యావరణానికి హాని కలుగుతోందని... ఆక్రమణలు తొలగించి చెరువును పరిరక్షించాలని ట్రిబ్యునల్ను ఆ సంస్థ కోరింది. దీంతో ధర్మాసనం వాస్తవాల పరిశీలనకు చెన్నైలో పర్యావరణ శాఖలోని సీనియర్ అధికారి, చెరువుల సంరక్షణ కమిటీ సభ్యుడు, జిల్లా కలెక్టర్తో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బుధవారం కమిటీ సభ్యులు చెరువును పరిశీలించి, గ్రామస్థులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించి తుది నివేదికను ధర్మాసనానికి నివేదించనున్నట్టు పర్యావరణ రీజనల్ అధికారి ఆర్.శంకరనాయక్ తెలిపారు. ఈ పరిశీలనలో చెన్నైకి చెందిన సైంటిస్ట్ ఆర్.శ్రీధర్, తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ శ్యామలకుమారి, ఎంపీడీవో బీవీఎస్ ప్రకాష్, సర్వేయర్ చిన్నప్పన్న పాల్గొన్నారు.