ఇంజనీరింగ్ చదివి రైల్లో పండ్లు అమ్ముతుంటే... చావబాదిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
ABN , First Publish Date - 2021-10-03T22:22:27+05:30 IST
ఇంజినీరింగ్ చదివిన యువతికి సరైన ఉద్యోగం రాకపోవడంతో
రూర్కేలా : ఇంజినీరింగ్ చదివిన యువతికి సరైన ఉద్యోగం రాకపోవడంతో రైళ్ళలో పండ్లు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో టిక్కెట్ కొనకుండా రైలులో ప్రయాణించారు. దీనిని గమనించిన ఓ ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఆమెను ఇష్టానుసారం కొట్టారు. దీంతో ఆమె గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలి కథనం ప్రకారం ఆమె కర్ణాటకలోని ధార్వాడ్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశారు. తగిన ఉద్యోగం దొరకకపోవడంతో రైళ్ళలో పండ్లు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. గీతాంజలి ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం రాత్రి హౌరా నుంచి గుండియా వెళ్తుండగా, పంపోష్ రైల్వే స్టేషన్లో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆమెను టిక్కెట్ అడిగారు. తన వద్ద డబ్బులు లేవని, టిక్కెట్ తీసుకోలేదని ఆమె చెప్పారు. దీంతో ఆ కానిస్టేబుల్ ఆమెను తీవ్ర పదజాలంతో దూషిస్తూ, లాఠీతో తలపై గట్టిగా కొట్టారు. ఆమె తలకు తీవ్రంగా గాయమైంది.
టీటీఈ తనకు జరిమానా విధించి ఉంటే తాను ఫిర్యాదు చేసేదానిని కాదని ఆమె అన్నారు. తనను దూషించడానికి, నిర్దాక్షిణ్యంగా కొట్టడానికి ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. ఈ వివరాలతో ఆమె రూర్కేలా గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు.
రూర్కేలా జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జి రంజన్ పట్నాయక్ మాట్లాడుతూ, బాధితురాలికి ప్రథమ చికిత్స చేయించామని చెప్పారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశామని చెప్పారు.