ఆధార్ బ్లాక్...!
ABN , First Publish Date - 2022-01-22T06:26:01+05:30 IST
ఆధార్ సేవలు పొందాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకవేళ కార్డు పొందినా అందులో తప్పొప్పులు సరిచేసుకోవాలంటే కత్తిమీద సాములాంటిదనే చెప్పొచ్చు.
ఆధార్ బ్లాక్...!
అప్డేషనపై అవగాహన కల్పించని సెంటర్ల నిర్వాహకులు
కనిపించని డిస్ప్లే బోర్డులు
ఏ మార్పును ఎన్నిసార్లు చేసుకోవాలో తెలియని
పరిస్థితిలో కార్డుదారులు
పలుమార్లు అప్డేషన చేయిస్తుండటంతో రిజెక్ట్ అవుతున్న వైనం
గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య
కార్డు బ్లాక్ చేసుకుని.. ఇబ్బందులు పడుతున్న జనం
అనంతపురం ప్రెస్క్లబ్, జనవరి 21: ఆధార్ సేవలు పొందాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకవేళ కార్డు పొందినా అందులో తప్పొప్పులు సరిచేసుకోవాలంటే కత్తిమీద సాములాంటిదనే చెప్పొచ్చు. అసలు ఆధార్ కార్డులో మార్పులుచేర్పులు చేయాలంటే అందులోని నియమ నిబంధనలు తెలియక చాలామంది తమ ఆధార్ కార్డులను బ్లాక్ చేసుకుంటున్నారు. సరైన సమయంలో అప్డేషన చేయకపోయినా... పదే పదే చేసినా.. కార్డులు రిజెక్ట్ అవుతున్నాయి. వీటిపై అవగాహన కల్పించాల్సిన ఆయా మీ-సేవ, బ్యాంకు, తపాలాశాఖల్లోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవట్లేదు. పరిశీలించకుండానే అప్డేషన చేస్తుండడంతోనే ఆధార్ కార్డు బ్లాక్ అవుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితి మరీ దారుణం. పల్లెల్లో ఆధార్ సెంటర్లు పనిచేయకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చి మరీ చేయించుకుంటున్నా... రిజెక్ట్ అవుతున్నాయి.
ఆధార్ సెంటర్ల నిర్వాహకులు విఫలం
ఆధార్లో ఒక్కో మార్పునకు వేర్వేరు నిబంధనలున్నాయి. వాటిని కార్డుదారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయా సెంటర్ల నిర్వాహకులపై ఉంటుంది. వారు ఆ మేరకు కార్డుదారులకు చెప్పకపోవడంతో చేసిన వాటినే పలుమార్లు అప్డేషన చేయించుకుంటుండటంతో రిజెక్ట్ అవుతున్నాయి. సాధారణంగా పేరు మార్పు చేయాలంటే... మూడుసార్లు అవకాశం ఉంటుంది. అదికూడా ఒక్కసారి అప్డేషన చేసిన తరువాత 10-15 రోజులు మెసేజ్ కోసం వేచి ఉండాలి. ఆ మెసేజ్ ఆధారంగా ఒకే అయితే ఫర్వాలేదు... రిజెక్ట్ అయితే మరోసారి చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి రిజెక్ట్ చివరగా మూడోఅవకాశం ఉంటుంది. అప్పుడు ఆధార్ సెంటర్ నిర్వాహకులు అన్నీ సక్రమంగా ఉన్నాయా.. లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే మూ డోసారి రిజెక్ట్ అయితే ఆధార్ కార్డు బ్లాక్ అవుతుంది. పుట్టిన తేదీని మా ర్పు చేయాలంటే ఒక్క అవకాశమే ఉంటుంది. ఇక్కడా అప్డేషన చేసే సమయం లో పుట్టినరోజు సర్టిఫికెట్, గెజిటెడ్ అధికారితో సంతకం చే యించుకున్న ఫా రంలో తేదీలను సరిచూసుకోవాలి. లేదంటే కార్డు బ్లాక్ అవుతుం ది. ఈ విష యం ప్రతి ఆధార్ సెంటర్ నిర్వాహకుడికి ఎరుకే... అయినా మా ర్పు చేసుకునే ఫారాలు పరిశీలించకపోవడం, అవగాహన కల్పించడంలో నిర్ల క్ష్యం వహిస్తుండటంతో జనం ఆధార్ కార్డులను చేజేతులా పోగొట్టుకుంటున్నారు.
కనిపించని డిస్ప్లే బోర్డులు
జిల్లాలో ప్రతి ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్కు ఎంత... పేరు మార్పు చేర్పులకు ఎంత... పుట్టిన తేదీ, చిరునామా మార్పులకు ఎంత చార్జ్ చేస్తారోనన్న డిస్ప్లేలు తప్పా... అసలు ఆధార్ నియమనిబంధనలు తెలిపే ఒక్క బోర్డు కూడా కనిపించదు. ఏయే మార్పునకు ఎంతెంత చార్జ్ చేస్తామో అన్నదానిపై చూపుతున్న శ్రద్ధ ఏ సమస్యకు ఎలా పరిష్కారం అన్న దానిపై లేదు. పేరు మార్పు అప్డేషనకు 3 సార్లు, పుట్టిన తేదీకి ఒక్కసారే అవకాశం. వీటిని పాటించకపోతే కార్డు బ్లాక్ అవుతుంది. ఒకవేళ బ్లాక్ అయితే ఎక్కడికెళ్లాలి.. ఎవరిని సంప్రదించాలన్న నిబంధనలను తెలియజేయడంలో ఆయా సెంటర్ల నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైనా బ్లాక్ అయిందని వస్తే... 1940కి కాల్ చేయాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఆ నెంబర్కు కాల్ చేస్తే వారు చెప్పే నిబంధనలు అర్థంకాక పలువురు మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. ఇక చదువురాని వారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా ఆధార్ సెంటర్ల వద్ద నియమనిబంధనలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కార్డుదారులు కోరుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం
గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సేవలు గగనంగా మారిపోయాయి. కనీసం మొబైల్ నెంబర్ లింకప్ చేయలేని పరిస్థితిలో కొన్ని ఆధార్ సెంటర్లు, బ్యాంకులున్నాయంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా అడ్రస్, పేరు మార్పుల కోసం వెళ్తే... నెట్వర్క్ సమస్యతో అప్డేషన చేసినా పలుమార్లు రిజెక్ట్ అవుతున్నట్లు సమాచారం. దీంతో ఆధార్ సమస్య తీరిందనుకుని తమ పనుల కోసం వెళ్తే... అక్కడ సమస్య అలాగే ఉందని చెబుతుండటంతో మళ్లీ ఆధార్ కేంద్రాల వైపు పరుగులు తీయా ల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. దీంతో రోజంతా పనులు వదులుకుని కి.మీ., మేర ప్రయాణం చేసి జిల్లాకేంద్రంలోని బ్యాంకులు, ఆధా ర్ సెంటర్లలో సేవలు వినియోగించుకుంటున్నారు. చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఉండాల్సిన బయోమెట్రిక్ యంత్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని ఆధార్ సెంటర్లలో లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేషన కాకపోవడంతో పాఠశాలలు, రేషనకార్డుల్లో ఎక్కించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల తిప్పలు చెప్పనక్కర్లేదు. సరైన సమయంలో వేలిముద్రలు పడక... ఐరిస్ పనిచేయక, మరికొన్ని చోట్ల ఐరిస్ యంత్రాలే లేక పలువురు వృద్ధులు పింఛన కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధార్ ఎప్పటికీ తీరని సమస్యగా మిగిలిపోయిందనడంలో సందేహం లేదు.
హైదరాబాద్ వెళ్లి సరిచేసుకున్నా.. మన్నీల నాగరాజు, కనగానపల్లి
నా కూతురు పుట్టిన తేదీ మార్పు చేయించేందుకు ధర్మవరంలోని మీ-సేవ సెంటర్కు వెళ్లా. అప్డేట్ చేయించా. అందులో నెల తప్పుగా ఉందన్న విషయం నాకు తెలీదు. ఆ ధార్ కేంద్రం నిర్వాహకులు కూడా చెప్పలేదు. దీంతో కార్డు బ్లాక్ అయిపోయింది. 1940కు కాల్ చేయమన్నారు. ఆ నెంబర్కు ఫోన చేస్తే ఏదేదో మాట్లాడుతున్నారు. మాలా ంటి చదువురానివాళ్లకు చెబితేనే కదా అర్థమయ్యేది. చేసేదిలేక హైదరాబాద్లోని ఆఫీసుకెళ్లి కార్డు సరిచేయించుకున్నా.
రెండుసార్లు అప్డేట్ చేయిస్తే... రిజెక్ట్ వచ్చింది..
ఆధార్ కార్డులో పేరు మార్పునకు మా ఊళ్లోని మీసేవ సెంటర్కు వెళ్లా. అక్కడ తహసీల్దార్ సంత కం కావాలంటే.. చేయించుకుని అప్డేట్ చేయించుకున్నా. 10 రోజుల తరువాత నా సెల్కు రిజెక్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తరువాత మళ్లీ బ్యాంకుకు వెళ్లి చేయించా. అక్కడ కూడా రిజెక్ట్ అని వచ్చింది. తప్పు ఏంటో ఎవరూ చెప్పలేదు.. అనంతపురంలోని పోస్టాఫీసుకు వెళ్తే... రెండు సార్లు చేయించావనీ, అందులో వేలిముద్రలు సరిపోలేదన్నారు. మరొక ఫారం చూపిస్తే అందులో పాతపేరుమీదుగానే అప్డేషన చేశారని చెప్పారు. మా ఊళ్లో మూడుసార్లే అవకాశం ఉన్నట్లు ఎవరూ చెప్పలేదు. ఈసారి అప్డేషన చేయించుకున్నా. ఏమవుతుందో ఏమో.. అర్థం కావడం లేదు.
- ఓంకార్, ఇంటర్ విద్యార్థి, కళ్యాణదుర్గం