రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2022-01-21T05:08:18+05:30 IST
విధి నిర్వాహణలో కొవిడ్ సోకి మృతిచెందిన ఆశ వర్కర్ కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
కాకినాడ క్రైం, జనవరి 20 : విధి నిర్వాహణలో కొవిడ్ సోకి మృతిచెందిన ఆశ వర్కర్ కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐవీ రావు, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.బేబీరాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అఽధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో కొవిడ్ సోకి మరణించిన ఆశ వర్కర్ కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారం ఇంకా అందలేదని అన్నారు. అనేక సార్లు వినతిపత్రాలు అందించినా స్పందించడం లేదని చెప్పారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదన్నారు. పీఆర్సీలో ఆశ వర్కర్ల వేతనాలు పెరుగుదల ప్రస్తావన లేకపోవడం అన్యాయమన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ గౌరీశ్వరరావు మాట్లాడుతూ కలెక్టర్తో చర్చించి అధికారులతో సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. యూనియన్ నాయకులు ఎస్తేరురాణి, వెంకటలక్ష్మి, లలిత, సీతారత్నం, నాగమణి పాల్గొన్నారు.