సైబర్క్రైమ్ పోలీసులకు ఏబీసీడీ అవార్డు
ABN , First Publish Date - 2020-08-13T11:18:53+05:30 IST
రాష్ట్రంలో నమోదైన కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచే పోలీసులకు అందజేసే అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్(ఏబీసీడీ)
హనీ ట్రాప్ కేసు ఛేదించినందుకు ప్రశంస
విశాఖపట్నం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నమోదైన కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచే పోలీసులకు అందజేసే అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్(ఏబీసీడీ) కన్సోలేషన్ బహుమతికి నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఎంపికయ్యారు. ఈమేరకు బహుమతిని డీజీపీ గౌతమ్సవాంగ్ బుధవారం విజయవాడలో అందజేశారు. కోల్కతా కేంద్రంగా ఆన్లైన్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి యువకులను మోసం చేసి వారి నుంచి డబ్బులు గుంజేస్తున్న(హ నీట్రాప్) ముఠా గుట్టును నగర సైబర్ క్రైమ్ పోలీసులు గత ఏడాది జూలైలో రట్టు చేశారు.
ఈ కేసులో 26 మంది ముఠా సభ్యులను అరెస్టు చేయడంతోపాటు వారి నుంచి మోసాలకు ఉపయోగించిన సెల్ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు కోల్కతా కేంద్రంగా ఒక కాల్సెంటర్ను ప్రారంభించారు. పాపులర్ ఫాంటీసీ డాట్కామ్ పేరుతో ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. అందులో అందమైన యువతుల ఫొటోలను పెట్టేవారు. వెబ్సైట్ను క్లిక్ చేసిన యువతకు సెక్స్తోపాటు రూమ్లు కూడా కల్పిస్తామంటూ ఆఫర్ ప్రకటిస్తారు. ఎవరైనా ఆసక్తితో వెబ్సైట్లోని అడ్రస్ను సంప్రదిస్తే వలలో వేస్తారు. దీనిపై ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత ఏడాది జూలై 28న సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన అప్పటి సీఐ గోపీనాధ్, ఎస్ఐ మనోజ్ కుమార్ దీనిపై దర్యాప్తు నిర్వహించి గుట్టురట్టు చేశారు.