దేశం దృష్టిని ఆకర్షిస్తోన్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రిట్ పిటిషన్
ABN , First Publish Date - 2021-06-01T01:09:48+05:30 IST
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రిట్ పిటిషన్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సుప్రీంకోర్టులో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ వేసిన కేసు మైలురాయిగా నిలిచిపోతుందని
హైదరాబాద్: ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రిట్ పిటిషన్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సుప్రీంకోర్టులో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ వేసిన కేసు మైలురాయిగా నిలిచిపోతుందని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులోనే 'రాజద్రోహం'పై పూర్తి మార్గదర్శకాలతో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటున్న న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఎంపీ రఘురామరాజుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తమ పేరు చేర్చడాన్ని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ముఖ్యంగా రాజద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం రాజ్యాంగం 19(1)(ఏ), (జీ) అధికరణల కింద కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లు. ప్రజా ప్రాముఖ్య అంశాలు కవర్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నమే ఇది. తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు సమాచారం రాకుండా చేయడమే! కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో చట్టాన్ని, నిబంధనలను పాటించకుండా రఘురామరాజును అరెస్టు చేసిన తీరును చూస్తే ఏబీఎన్ సంస్థ యాజమాన్యం, సంస్థ ఉద్యోగుల ప్రాణాలకు, స్వేచ్ఛకు తీవ్ర ముప్పు ఏర్పడినట్లు! రఘురామకృష్ణంరాజు తన విలేకరుల సమావేశం సమయం, వేదిక గురించి వాట్సాప్ ద్వారా అన్ని చానళ్లకు సందేశం ఇచ్చేవారు. మిగతా చానళ్లలాగే ఏబీఎన్ కూడా సందేశాలు అందుకుని విలేకరుల సమావేశానికి హాజరయ్యేది. ఏబీఎన్, టీవీ5తో పాటు ఇతర చానళ్లు కూడా విలేకరుల సమావేశాన్ని ప్రసారం చేశాయి. కానీ ఎఫ్ఐఆర్లో ఆశ్చర్యంగా రెండు చానళ్లు రఘురామరాజుతో కుట్రపన్నినట్లు పేర్కొన్నారు’ అని పిటిషన్లో తెలిపింది.