ఏబీయన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలి
ABN , First Publish Date - 2021-01-20T20:20:49+05:30 IST
తమ ప్రాంతంలో నిలిపివేసిన ఏబీయన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
నల్లజర్ల (పగో): తమ ప్రాంతంలో నిలిపివేసిన ఏబీయన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో నిలిపివేసిన ఏబీయన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ నల్లజర్ల మండలం జగన్నాధపురం గ్రామంలో గ్రామస్థులు, టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న అక్రమాలను వెలికి తీస్తున్నందుకే ఏబీయన్ ప్రసారాలను నిలిపివేశారని ఆరోపించారు.
మీడియాతో పెట్టుకున్న ఏ సీఎం కూడా ఎక్కువ రోజులు అధికారంలో లేడని ఆయన అన్నారు. మీడియా పై తన వైఖరిని సీఎం జగన్ మార్చుకోవాలని ఆయన కోరారు. ఏబీయన్ ప్రసారాలను నిలిపివేసినంత మాత్రాన నిజాలను దాచలేరన్నారు. వైసీపీ నాయకుల అక్రమాలు, అవినీతిని ఏబీయన్ ఆంధ్రజ్యోతి వెలికి తీస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. ప్రజల కష్టాలను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేవడంలో ఏబీయన్ ముందుంటందన్నారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆందోళనకారులు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో టీడీపీ నేత, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.