YSRCP లో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. రెండు వర్గాలు ఎదురుపడితే ఢీ కొట్టుడే.. హైకమాండ్కు తలనొప్పి!!
ABN , First Publish Date - 2021-08-11T18:49:11+05:30 IST
అధికారపార్టీలోని ఆ ఇద్దరు నేతలు ఢీ కొట్టుకుంటున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు కత్తులు నూరుతున్నారు....
అధికారపార్టీలోని ఆ ఇద్దరు నేతలు ఢీ కొట్టుకుంటున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు కత్తులు నూరుతున్నారు. హైకమాండ్ అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసోళ్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే రాయలసీమ అందులో ఫ్యాక్షన్ జోన్ ఆపై అధికారపార్టీ రెండు వర్గాలు డిష్యుం డిష్యుంకు తెరతీయడంతో అక్కడి ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో అనుకుంటున్నారట. ఇంతకీ ఆ నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అని ఎందుకు ఛాలెంజ్ చేసుకుంటున్నారు? అసలు ఎందుకీ పరిస్థితి నెలకొంది..? ఇందుకు కారణాలేంటి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో చూద్దాం.
ఇమేజ్, మైలేజ్ కోసం వైసీపీలో వర్గపోరు..!
ఆ ఇద్దరు నేతలకు పైసా ఉంది. పవర్ ఉంది. పైగా అధికారపార్టీలో అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆధిపత్యపోరుకు తెరతీశారు. పబ్లిక్లో ఇమేజ్, మేలైజీ కంటిన్యూ అయ్యేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు శాంతి భద్రతల సమస్యలకు కూడా దారితీస్తున్నాయి.
రెండు వర్గాలు ఎదురుపడితే ఢీ కొట్టుడే!
కర్నూలులో నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు గోటితో పోయే విషయాన్ని గొడ్డలిదాకా తీసుకువస్తున్నట్లు ప్రజలనుకుంటున్నారు. కర్నూలు సిటీలో అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఏ చిన్న కార్యక్రమం జరిగినా రెండు వర్గాలు ఎదురుపడుతుంటడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది.
ఖాన్ ఫొటో లేదని రెడ్డి ఫ్లెక్సీలు చించేశారు!
తాజాగా జమ్మిచెట్టు ఆటోస్టాండ్ వద్ద వైసీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు ప్లాన్ చేశారు. మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం పలుకుతూ జమ్మిచెట్టు ఆటోస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఎస్వీ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను ఆయన అనుచరులు కట్టారు. అయితే ఆ ఫ్లెక్సిల్లో తమ నాయకుడి ఫోటో లేదని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు సీరియస్ అయ్యారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను అక్కడ నుంచి తొలగించారు. దీంతో విషయం తెలుసుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు జమ్మిచెట్టు ఆటో స్టాండ్ వద్దకు చేరుకున్నారు. రెండు వర్గాల వారు భారీగా తరలివచ్చారు. పోటా పోటీగా నినాదాలు, పరస్పర దూషణల వల్ల జమ్మిచెట్టు ఏరియాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
కరవమంటే కప్పకు.. విడమవంటే పాముకు కోపం!
అధికారపార్టీలోని రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు మోహరించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు పరిస్థితి కనిపించడంతో పోలీసులు ఎవరికి ఏం చెప్పాలో తెలియక తలలుపట్టుకోవాల్సివచ్చింది.
పైచేయి సాధించిన ఎమ్మెల్యే వర్గం!
మొత్తానికి జమ్మిచెట్టు దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. ఎస్వీ మోహన్రెడ్డి ఫోగ్రాం పోస్ట్పోన్ కావడంతో ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ వర్గం తమదే పైచేయి అయినట్లు సంతోషంగా ఉందట. అయితే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరోసారి గ్రాండ్గా చేస్తామని మాజీ ఎమ్మెల్యే వర్గం ఛాలెంజ్ చేస్తోంది.
ఢీ అంటే ఢీ.. హైకమాండ్కు తలనొప్పి..!
ఈ ఇద్దరు నేతల మధ్య వర్గపోరు ఇప్పటిది కాదు. ఎస్వీ మోహన్రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లొచ్చి తిరిగి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2019 ఎన్నికల్లో ఎస్వీకి టికెట్ రాలేదు. హఫీజ్ఖాన్కు ఎమ్మెల్యే ఛాన్స్ వచ్చింది. వచ్చిన పట్టును కంటిన్యూ చేసేందుకు ఎస్వీని ఏ కార్యక్రమంలోనూ ఎంటర్ కాకుండా చేయాలనేది ఎమ్మెల్యే ఖాన్ ప్లాన్గా ఉన్నట్లు ప్రత్యర్థివర్గం భావిస్తోంది. హఫీజ్ఖాన్ అణిచివేత రాజకీయాలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి రాజకీయ చతురతతో తిప్పికొడుతున్నారు.
ఖాన్ వర్సెస్ రెడ్డి పాలిటిక్స్!
అధికారిక కార్యక్రమైనా, పార్టీ కార్యక్రమమైనా పై చేయి సాధించేందుకు రెండువర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వైఎస్సార్ జయంతి కార్యక్రమంలోనూ రెండు వర్గాలు ఢీకొట్టుకోవడంతో హైకమాండ్ వారించాల్సివచ్చింది. పలుమార్లు ఈ రెండు వర్గాలు పోటాపోటీ రాజకీయ కార్యక్రమాలు చేస్తుండటంతో హైకమాండ్కు తలనొప్పిగా మారింది. స్థానిక బలాల నేపథ్యంలో ఏవర్గం వారిని పక్కనపెట్టినా మరోవర్గం వారితో ఇబ్బందులు తప్పవని అధిష్టానం ఆచితూచి వ్యవహరించాల్సివస్తోందని న్యూట్రల్గా ఉంటున్న కార్యకర్తలు అనుకుంటున్నారట.