రఘురామ కేసులో ఏబీఎన్‌పై ఎటువంటి చర్యలు చేపట్టరాదు: సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-05-31T23:33:59+05:30 IST

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సుప్రీంకోర్టులో విజయం దక్కింది. ఎంపీ రఘురామ కేసులో ఏబీన్‌పై ఎటువంటి తీవ్రమైన చర్యలు చేపట్టరాదని.. ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రఘురామ కేసులో ఏబీఎన్‌పై ఎటువంటి చర్యలు చేపట్టరాదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: ఎంపీ రఘురామ కేసులో ఏబీన్‌పై ఎటువంటి తీవ్రమైన చర్యలు చేపట్టరాదని.. ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏబీఎన్‌పై రాజద్రోహం కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. రాజద్రోహం కేసు నమోదు చేసేంత తప్పు ఏబీఎన్‌ ఏం చేసిందని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీ రఘురామ వ్యాఖ్యలను ప్రసారం చేయడం.. రాజద్రోహం ఎలా అవుతుందని పేర్కొంది. ఏ సందర్భంలో రాజద్రోహం కేసు పెట్టాలో.. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని ధర్మాసనం తెలిపింది. సెక్షన్‌ 124ఏ, 153 పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ప్రతి చిన్నవిషయానికి రాజద్రోహం కేసు పెడితే.. అసలు ఏ వార్తలు కూడా మీడియా ప్రసారం చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గంగానదిలో మృతదేహాన్ని పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ చానల్‌ చూపించిందని, మరి ఆ చానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా..? అని ప్రశ్నించింది. 


ఎంపీ రఘురామతో కలిసి ఏబీఎన్‌ కుట్రచేసినట్టు.. ఎఫ్‌ఐఆర్‌లో దర్యాప్తు సంస్థ ధృవీకరించలేదని పేర్కొంది. మీడియాను గుప్పిట్లో ఉంచుకునేందుకు, భయపెట్టేందుకు.. రాజద్రోహం కేసు నమోదని అభిప్రాయపడింది. ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శ రాజద్రోహం కాదని,  ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వానికి, సీబీసీఐడీ, తెలంగాణ ప్రభుత్వానికి.. కేంద్ర హోంశాఖకు, కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 


దేశం దృష్టిని ఆకర్షిస్తోన్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ రిట్‌ పిటిషన్‌

Updated Date - 2021-05-31T23:33:59+05:30 IST