Janasena-TDP లోకల్ లీడర్ల పొత్తు దేనికి సంకేతం.. YSRCP కి మున్ముందు వచ్చే చిక్కులేంటి.. అసలు రాజకీయం ఏంటో..!?
ABN , First Publish Date - 2021-10-16T19:55:28+05:30 IST
ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఓ హింట్ ఇచ్చాయా?...
అక్కడ వచ్చిన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఓ హింట్ ఇచ్చాయా? అధికార పార్టీకి రెడ్ అలర్ట్ సిగ్నల్ చూపించాయా? ఆ నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలు కలిసి అధికారపార్టీకి ఓడించిన తీరు మున్ముందు జరిగే సమీకరణాలకు ఓ సూచనగా అధినాయకత్వాలు సైతం ఆలోచనలో పడ్డాయా? ఇంతకీ ఎక్కడ జరిగిన లోకల్ పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ను షేక్ చేసేందుకు ఓ ట్రయల్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది.. అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో చూద్దాం.
లోకల్ లీడర్ల పొత్తు దేనికి సంకేతం..?
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల వరకు పెను మార్పులు రానున్నాయా? ప్రాదేశిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం లోకల్ లీడర్ల పొత్తుతో ఆ రెండు పార్టీల జయభేరి దేనికి సంకేతం? అగ్రనాయకత్వాలు కలిసి రానప్పటికి లోకల్ లీడర్లు చేసిన అండర్ గ్రౌండ్ పాలిటిక్స్..అండర్ కరెంట్ పుట్టించాయా? అధికార వైసీపీకి ఇక్కడ సెగ మొదలైనట్లేనా అనే చర్చ జరుగుతోంది.
టీడీపీ, జనసేన పన్నిన వ్యూహమేంటి..?
ప్రాదేశిక ఎన్నికల్లో భీమవరంలో అధికార వైసీపీని ఓడించేందుకు జనసేన, టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకుపోయాయి. ఏయే సమీకరణాలు కలిసివచ్చాయనేది నియోజకవర్గంలో చర్చకు తెరలేపాయి. అన్నీ గమనిస్తున్న సామాన్య ఓటర్లు, స్థానిక లీడర్లు ఇక అధికార పార్టీకి కష్టమనే ఫీలర్లు వదులుతున్నారు.
ప్రతిపక్షపార్టీ పోటీచేయకుండా వైసీసీ గెలుపు గెలుపేనా?
రాష్ట్రవ్యాప్తంగా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల్లో వైసీసీది తిరుగులేని విజయమని ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారం పసలేనిదని ప్రతిపక్షపార్టీలు కొట్టిపారేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీలో లేకుండా వైసీపీ గెలిచిన గెలుపు గెలుపు ఎలా అవుతుందనే ప్రశ్నలు భీమవరంలో వినిపిస్తున్నాయి. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండల పరిధిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన హేమాహేమీలు ప్రచారం చేయకున్నా, ఆయా పార్టీల అగ్రనేతల నుంచి పెద్దగా మద్దతు లేకపోయినా లోకల్ లీడర్లు కష్టపడి విజయం సాధించిన తీరు విశ్లేషకులను ఆలోచింపచేస్తోంది. ఈ మండలంలో పొత్తులో భాగంగా జనసేన జడ్పీటీసీ సీటును వశం చేసుకుంటే ఎంపీపీ చైర్లో టీడీపీ కూర్చుని లోకల్ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు సవాల్ విసిరాయి.
ఎమ్మెల్యేకు ఎందుకంత ఆరాటం..?
వాస్తవానికి ఈ ఒక్క జడ్పీటీసీ, యంపీపీ స్థానంతో వైసీపీకి ఇప్పటికిప్పుడు పొలిటికల్గా వచ్చే నష్టమేమీలేదు. అయినా వైసీపీ కోసం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..టీడీపీ కోసం వీరవల్లి చంద్రశేఖర్, జనసేన తరఫున గుండా జయప్రకాశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే 2014 ప్రాదేశిక ఎన్నికల్లో వీరవల్లి ..టీడీపీ తరఫున, గుండా జయప్రకాశ్ వైసీపీ తరఫున పోటీ చేశారు. వైసీపీ తరఫున గెలిచిన గుండా.. ఆతర్వాత జనసేనలోకి చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రెండు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా మరో ఐదింటిని పోటీలో గెలుచుకోగలిగింది.
టాక్ ఏంటి..!?
మొత్తం 17 స్థానాల్లో 8 జనసేన, నాలుగు టీడీపీ గెలుచుకుంది. యంపీపీగా టీడీపీ తరఫున వీరవల్లి దుర్గా భవానీ బాధ్యతలు చేపట్టారు. జడ్పీటీసీగా జనసేన నుంచి గుండా జయప్రకాశ్ జయకేతనం ఎగరేశారు.ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఎంపీటీసీలకు, జడ్పీటీసీకి వచ్చిన ఓట్లు చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్కు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువగా ఉండటమే లోకల్ రాజకీయ మార్పులకు ముందస్తు సంకేతాలనే ప్రచారం హైలెట్ అవుతోంది. ఓవరాల్గా భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేనలకు వచ్చిన ఓట్లు వైసీపీ నేతలకు మింగుడు పడకుండా చేస్తున్నాయనే టాక్ నడుస్తోంది.