ఓపీ చార్జీలతో బీపీ
ABN , First Publish Date - 2020-07-09T10:42:12+05:30 IST
మూడు దశాబ్దాల క్రితం రోగులు తొలిసారి ప్రైవేట్ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకుని నామమాత్రంగా రూ.10 లేదా రూ.25 తీసుకుని ఓపీ కార్డు
కరోనా తెచ్చిన కష్టాలు
ఓపీ చీటీ చెల్లుబాటు ఒక్కరోజే..
వీడియో కాలింగ్ ద్వారా వైద్యం
జిల్లాలో 25 శాతం ఆసుపత్రులలోనే ఓపీ
ప్రభుత్వాసుపత్రులలో 10 శాతానికి తగ్గిన రోగులు
అసలే కరోనాతో జనం బిక్కుబిక్కు మంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఏదైనా రోగమొస్తే ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడి చస్తున్నారు.. రోగం కంటే వాళ్ళ ఫీజుల బాదుడికే గుండె గుభేల్మంటోంది.. పరిమిత సంఖ్యలోనే ఆసుపత్రులు పనిచేస్తుండడంతో దోచినంత దోపిడీ జరుగుతోంది..
పాలకొల్లు, జూలై 8 : మూడు దశాబ్దాల క్రితం రోగులు తొలిసారి ప్రైవేట్ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకుని నామమాత్రంగా రూ.10 లేదా రూ.25 తీసుకుని ఓపీ కార్డు ఇచ్చేవారు. ఈ కార్డు ఏడాదిపాటు చెల్లుబాటయ్యేది. మూడు నెలల తర్వాత మళ్లీ కార్డు తీయిస్తే రూ.5, ఆరు నెలల అనంతరం వస్తే రూ.10 తీసుకునేవారు. కాలక్రమంలో కార్డు కాల పరిమితి ఏడాది నుంచి 9 నెలలకు, తరువాత ఆరు నెలలకు, తర్వాత మూడు నెలలకు, ఇటీవల నెలకు, కొన్ని ఆసుపత్రులలో 15 రోజులకు పరిమితం చేశారు. కరోనా నేపఽథ్యంలో కార్డు కాల పరిమితి 24 గంటలకు పడిపోయింది. జిల్లాలోని అధిక శాతం ఆసుపత్రులలో దాదాపు ఓపీ మూసివేశారు. పరిమిత సంఖ్యలో ఔట్ పేషంట్లను చూస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులలో బాదుడు మొదలుపెట్టారు. గతంలో కార్డు రూ.150 ఉంటే ఇప్పుడు రూ.300 చేశారు. అదీ ఒక్కరోజుకే పరిమితం. మర్నాడు వెళితే మరో రూ.300 చదివించాల్సిందే.
ఫోన్ ద్వారా వైద్యం
జిల్లాలోని పలు ఆసుపత్రులలో నేరుగా పేషెంట్లను చూడడం మానేసిన వైద్యులు ఆన్లైన్ వైద్యం చేస్తున్నారు. వీడియో కాల్ అవకాశం ఉంటే రోగితో మాట్లాడి వైద్య సలహాలు ఇస్తూ మందులు సూచిస్తున్నారు. బేసిక్ ఫోన్లలో రోగులు తమ అనారోగ్య వివరాలను చెబుతుంటే వైద్యులు సలహాలు ఇస్తున్నారు. పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే తదితర మార్గాల ద్వారా ఫీజులు చెల్లిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం తదితర అత్యవసర వ్యాధులు బారిన పడిన రోగులు వస్తే నేరుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నారు. జ్వరం, దగ్గు, రొంప, శరీర నొప్పులు వంటి వ్యాధులతో రోగులు వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో
జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పాల కొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రికి కరోనాకు ముందు రోజుకు 300 నుంచి 400 మంది వైద్యానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 నుంచి 40కు పడిపోయింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ కరోనాకు ముందు సుమారు ఐదు నుంచి ఆరు వేల మంది వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 500-600లకు తగ్గింది. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కేవలం కొవిడ్-19 వైద్య అవసరాలకు వినియోగించడంతో అక్కడ ఓపీ అవకాశం లేకుండా పోయింది. మిగిలిన ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య తగ్గింది.
గర్భిణుల ఇబ్బందులు
పేద వర్గాలకు చెందిన గర్భిణులు వైద్య సేవలు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రులలో ప్రసూతి వైద్యుల కొరతతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ సాధారణ డెలివరీకి రూ.10 నుంచి 20 వేలు ఖర్చు అవుతుంది. శస్త్ర చికిత్స చేసి బిడ్డను తీయాల్సి వస్తే ఆసుపత్రులను బట్టి రూ.30 నుంచి రూ.50 వేలు ఛార్జీ వసూలు చేస్తున్నారు.