‘సిరివెన్నెల’తో అనుబంధం..
ABN , First Publish Date - 2021-12-01T06:31:39+05:30 IST
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్ర్తి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు, పరిచయస్థులు.
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్ర్తి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు, పరిచయస్థులు. తమకు సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనతో తమకున్న సాంగత్యాన్ని ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారిలా..
నన్ను పిలిచి మాట్లాడారు..
తాడేపల్లిగూడెం రూరల్, నవంబరు 30 : సీతారామశాస్త్రి గారికి ఎవరు దగ్గరైనా నోరారా వరుస పెట్టి పిలవండని చెప్పి పిలిపించుకునేంత సహృదయుడు. ఆయన రచించిన ‘కృష్ణం వందే జగద్గురుం’లో జరుగుతున్నది జగన్నాటకం పాట, సిరివెన్నెలలో విరించినై విరచించితిని పాటలను యూ ట్యూబ్లో వివరణాత్మకంగా తెలిపాను. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయనే స్వయంగా పిలిపించి మాట్లాడారు. తర్వాత తెలుగు భాషపై క్వోరా కమ్యూనిటీ మేనేజర్గా పనిచేస్తుండటంతో ఆయనతో ప్రత్యేకంగా ప్రశ్నలు–జవాబులు కార్యక్రమంతో మరింత దగ్గరయ్యా. ఆయన మృతి తెలుగు భాషకు తీరని లోటు.
– సూరంపూడి పవన్ సంతోష్, తాడేపల్లిగూడెం
ఆ క్షణాన్ని మర్చిపోలేను..
గణపవరం: ‘షిర్డీ సాయి చిత్రంలో నేను రాసిన పాట విని సీతారామ శాస్ర్తి నన్ను అభినందించిన క్షణం ఎప్పటికీ మరువలేనిది. ఆయనను దర్శకుడు కె.రాఘవేంద్రరావు పరిచయం చేశారు. అనుబంధాలు.. ప్రాణం పోసుకునేలా.. అనురాగాలు వెల్లి విరిసేలా దేశభక్తి రగిలించేలా.. ప్రేమకు కొత్త కొత్త నిర్వచనాలు అందిచేలాగా.. పదునైన పాటలను తెలుగు ప్రజలకు అందించిన సిరివెన్నెల కలం హఠాత్తుగా ఆగిపోవడంతో తెలుగు సినీ ప్రపంచం ఒక్కసారిగా అంధకారంలో మునిగిపోయింది. సిరివెన్నెల అస్తమిం చినా.. సాహిత్య వెన్నెలలు మాత్రం ఆ చంద్ర తారార్కం.
– మేడిచర్ల సత్యనారాయణమూర్తి, సినీ గేయ రచయిత