కలెక్టరేట్లోకి ఏబీవీపీ కార్యకర్తలు
ABN , First Publish Date - 2021-09-18T06:15:07+05:30 IST
కలెక్టరేట్లోకి ఏబీవీపీ కార్యకర్తలు
జెండా ఆవిష్కరణకు యత్నం
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఖమ్మంకలెక్టరేట్, సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్లోకి చొరబడి జాతీయజెండాను ఆవిష్కరించబోయారు. ఏబీ వీపీ నాయకులు ముక్కెర భరత్ ఆధ్వర్యంలో పలువురు యువకులు ఆటోల్లో కలెక్టరేట్లోకి వచ్చారు. జాతీయ జెండాతో పాటు ఏబీవీపీ జెండాలను పట్టుకుని కలెక్టరేట్లోకి చొరబడి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తు జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు కలెక్టరేట్ పైభాగానికి ఎక్కబోయారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన కలెక్టరేట్కు చేరుకున్నారు. వన్టౌన్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించి విడిచి పెట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు భరత్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై 6ఏళ్లు కావస్తున్నా ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్య క్రమంలో శ్రీకాంత్, పవన్, శంకర్, తరుణ్, కిష్ణ, వినోద్, వంశీ బానోత్ రాజేష్, భావ్సింగ్ పాల్గొన్నారు.