ఏసీబీ వలలో వీఆర్వో

ABN , First Publish Date - 2022-01-22T06:28:13+05:30 IST

గూడూరు మండలం మల్లవోలు-1 వీఆర్వో మర్రివాడ శ్రీనివాసరావు రూ.25వేలు లంచం తీసుకుని శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో వీఆర్వో
లంచం తీసుకుని పట్టుబడిన వీఆర్వో ఎం.శ్రీనివాసరావు (కూర్చున్న వ్యక్తి)తో ఏసీబీ అధికారులు

రూ.25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన మల్లవోలు-1 వీఆర్వో 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : గూడూరు మండలం మల్లవోలు-1 వీఆర్వో మర్రివాడ  శ్రీనివాసరావు రూ.25వేలు  లంచం తీసుకుని శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం కాలేఖాన్‌ పేటలోని దేవీ నాంచారమ్మ అమ్మవారి గుడికి 3.50 ఎకరాల భూమి ఉంది. మచిలీపట్నంకు చెందిన మురాల నాగభూషణం ఈ భూమిని 2010లో ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ భూమి ఆలయం పేరుతోనే ఉంది. ఆలయ ట్రస్టీ కోసూరు నాంచారయ్య  ఈ భూమికి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల కోసం గత ఏడాది ఆగస్టులో జరిగిన స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు ఆర్డీవో కార్యాలయం నుంచి గూడూరు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరింది. అయితే పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు ఇవ్వాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని మల్లవోలు-1 వీఆర్వో శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. తొలి విడతగా రూ.25 వేలు ఇస్తామని వీఆర్వోకు చెప్పిన నాంచారయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు నాంచారయ్య నగదు తీసుకుని శుక్రవారం గూడూరు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి, వీఆర్వో శ్రీనివాసరావుకు నగదు అందజేశాడు. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని, ఆయన వద్ద ఉన్న రూ.25 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పట్టుబడిన వీఆర్వోను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 

Updated Date - 2022-01-22T06:28:13+05:30 IST