జగిత్యాల మున్సిపల్లో ఏసీబీ విచారణ
ABN , First Publish Date - 2021-06-14T06:34:00+05:30 IST
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు.
- రెవెన్యూ విభాగంలో విస్తృతంగా సోదాలు
- కమిషనర్తో పాటు ముగ్గురు ఉద్యోగుల పనితీరుపై ఆరా
- పలు రికార్డులు స్వాదీనం
జగిత్యాల, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. మున్సిపల్ రెవెన్యూ విభాగంలో మ్యుటేషన్ సందర్భంగా అవినీతి, అక్రమాలు చోటుచేసు కుంటు న్నాయని వచ్చిన ఆరోపణల మేరకు కరీంనగర్ ఏసీబీ ఇన్స్పెక్టర్ రాముతో పాటు మరో ముగ్గురు అధికారులు విచారణ జరిపారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో పాటు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్లను విచారించారు. రెవెన్యూ విభాగంలోని పలు ఫైళ్లను పరిశీలించారు. మ్యుటేషన్ సంద ర్భంగా వసూలు చేసిన రుసుమును ఆన్లైన్ విధానంలో తక్కువగా నమోదు చేసి, ఆఫ్లైన్లో రశీదు బుక్కుల్లో ఎక్కు వగా నమోదు చేస్తున్నట్లుగా గుర్తించారు. పట్టణానికి చెందిన ముగ్గురు భవన యజమానుల వద్ద నుంచి మ్యుటేషన్ పేరిట డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపారు. మున్సిపల్లో ఆరు నెలల కాలంగా జరిగిన మ్యుటేషన్ ఫైళ్లను పరిశీలించారు. ఇప్పటివరకు చేసిన మ్యుటేషన్లు ఎన్ని, దరఖాస్తుదారుల నుంచి ఎంత వసూళ్లు చేశారు. అన్న కోణాల్లో విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో పాటు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్ వద్ద నుంచి రాత పూర్వక నివేదికలను తీసుకున్నారు. పలు బిల్లు బుక్కులు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఆరు గంటల పాటు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ విచారణ కొనసాగింది.