బందరు కార్పొరేషన్లో ఏసీబీ జల్లెడ
ABN , First Publish Date - 2021-06-24T06:54:35+05:30 IST
మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ విభాగంతో పాటు ఇతర శాఖల రికార్డులను ఏసీబీ అధికారులు రెండోరోజు బుధవారం జల్లెడ పట్టారు.
మచిలీపట్నం టౌన్, జూన్ 23 : మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ విభాగంతో పాటు ఇతర శాఖల రికార్డులను ఏసీబీ అధికారులు రెండోరోజు బుధవారం జల్లెడ పట్టారు. దీంతో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 14 భవనాలు రికార్డులలో పాకలు, రేకుల షెడ్లుగా చూపిస్తూ సరైన పన్నులు విధించలేదు. అదేవిధంగా 158 కు ళాయిలు అనుమతులు లేకుండా కనెక్షన్లు ఇచ్చినట్టు ఏసీబీ అధికారుల తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కనెక్షన్లకు నగర పాలక సంస్థ పన్నులు విధించడం లేదని తెలిసింది. ఏసీబీ డీఎస్పీ పి.శరత్బాబు నాయకత్వంలో సీఐ ఎ.వి.శివ కుమార్, ఎస్సైలు నాంచారయ్య, నజరుల్లా ఈ దాడులో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు రికార్డులను తనిఖీ చేశారు. అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కమిషనర్ ఎస్.శివరామకృష్ణ, రెవెన్యూ ఆఫీసర్ ఎస్వెంకటేష్, మునిసిపల్ ఇంజనీర్ త్రినాథ్ల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు.