Tiruchiలో మహిళా అవినీతి తిమింగలం
ABN , First Publish Date - 2021-12-01T13:48:48+05:30 IST
తిరుచ్చి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఓ మహిళా అవినీతి తిమింగిలాన్ని పట్టుకున్నారు. ఈమె ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కోట్లాది రూపాయల మేరకు
- సబ్ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు
- వంద ట్యాంకర్లు, రూ.కోట్లలో ఆస్తులున్నట్టు గుర్తింపు
అడయార్(చెన్నై): తిరుచ్చి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఓ మహిళా అవినీతి తిమింగిలాన్ని పట్టుకున్నారు. ఈమె ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కోట్లాది రూపాయల మేరకు అక్రమాస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆమె పేరుపై అనేక గృహాలు, పెట్రోల్ బంకుతో పాటు వంద ట్యాంకర్లున్నట్టు గుర్తించారు. వివరాల్లోకి వెళితే... ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని తిరువారూరు జిల్లా మన్నార్గుడి సబ్కలెక్టర్ భవానీపై చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె నివాసగృహం, ఆమె నడుపుతున్న పాఠశాల, పెట్రోలు బంకు సహా పలుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో భవానీ శ్రీరంగం తహసీల్దార్గా, రెవెన్యూ శాఖలో కీలక పదవుల్లో పనిచేశారు. ఆ సమయంలో విపరీతంగా లంచాలు వసూలు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈమె యేడాది క్రితమే రెవెన్యూ కోర్టులో స్పెషల్ సబ్కలెక్టరుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తిరుచ్చి ఏసీబీ ఎస్పీ మణికంఠన్, సీఐ శక్తివేల్ తదితరులు భవానీ ఉంటున్న ఇంటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో తిరుచ్చి సమీపం వాలాడి ప్రాంతంలో ఆమెకు చెందిన పెట్రోలు బంకు, మనచ్చనల్లూరులో ఆమె నడుపుతున్న మెట్రిక్యులేషన్ పాఠశాల, దాల్మియాపురంలోని అల్యూమినియం కర్మాగారంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువ చేసే దస్తావేజులతో పాటు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈమెకు సొంతంగా 100 ట్యాంకర్ లారీలు ఉన్నట్టు గుర్తించారు.