ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి

ABN , First Publish Date - 2021-11-27T05:15:58+05:30 IST

కుమారుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ సచివాలయ వార్డు రెవెన్యూ సెక్రటరీ పట్టుపడ్డారు.

ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి
పట్టుబడిన వార్డు రెవెన్యూ సెక్రటరీ కె.శ్రీనివాసరావును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ బి.శ్రీనివాస్‌

చిలకలూరిపేట, నవంబరు 26: కుమారుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ సచివాలయ వార్డు రెవెన్యూ సెక్రటరీ పట్టుపడ్డారు. విజయవాడ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ బి.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన రేపూడి రాజేష్‌ తన కుమారుడి ఎన్టీఆర్‌ కాలనీ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. వార్డు రెవెన్యూ సెక్రటరీ కె.శ్రీనివాసరావు విచారించి సదరు అర్జీని తహసీల్దార్‌ కార్యాలయానికి పంపాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి శ్రీనివాసరావు రూ.5వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేష్‌ అంత నగదు ఇచ్చుకోలేనని రూ.3వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. ఈ క్రమంలో శుక్రవారం రాజేష్‌ నుంచి రూ.3వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు రవిబాబు, శ్రీధర్‌, నాగరాజు, అంజిబాబు, సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-11-27T05:15:58+05:30 IST