జాతీయ రహదారికి భూ సేకరణ వేగవంతం

ABN , First Publish Date - 2021-01-21T06:16:13+05:30 IST

రాయ్‌పూర్‌ నుంచి నుంచి విశాఖపట్టణం వరకూ మంజూరైన ఆరు వరుసల జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ వేగంగా చేయాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ రహదారులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

జాతీయ రహదారికి భూ సేకరణ వేగవంతం
మాట్లాడుతున్న ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

50 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోస్టల్‌ కారిడార్‌

రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు 

కలెక్టరేట్‌, జనవరి 20 : రాయ్‌పూర్‌ నుంచి నుంచి విశాఖపట్టణం వరకూ మంజూరైన ఆరు వరుసల జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ వేగంగా చేయాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ రహదారులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్టణం నుంచి రాయిపూర్‌ వరకు మంజూరైన ఆరు వరుసల జాతీయ రహదారిని రూ.2200 కోట్ల ఆంచనా ఖర్చుతో చేపడుతున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో 95 కిలోమీటర్లు పొడవు కలిగిన ఈ రహదారి కోసం 9 మండలాలకు చెందిన 49 గ్రామాల్లో 516 హెక్టార్లలో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. అటవీ భూమి క్లియరెన్స్‌ చేయాలని, విద్యుత్‌ స్తంభాల తొలగింపు, జల వనరుల గుర్తింపు, వ్యవసాయ, ఉద్యాన తోటల లెక్కింపు తదితర పనులు వేగంగా చేయాలని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.4వేల కోట్లతో వివిధ జాతీయ రహదారులను నిర్మించనున్నట్లు చెప్పారు. విశాఖపట్టణం నుంచి భోగాపురం వరకూ కోస్టల్‌ కారిడార్‌ను 50 కిలోమీటర్ల మేర చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి డీపీఆర్‌ సిద్ధమైందని వెల్లడించారు. రహదారులన్నీ పూర్తిచేసి ఎయిర్‌పోర్టుతో కనెక్టివిటీని పెంచుతామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జేసీ కిషోర్‌కుమార్‌, సహాయ కలెక్టర్‌ కట్టా సింహాచలం, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ విదేఖర్‌, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T06:16:13+05:30 IST