చెరువులోకి.. కారు
ABN , First Publish Date - 2022-01-18T06:28:03+05:30 IST
అదుపు తప్పిన కారు చెరువులో బోల్తా పడటంతో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి ఎర్రబాలెం శివారులో చోటుచేసుకుంది.
నలుగురు యువకుల దుర్మరణం
స్థానికులు అప్రమత్తమైనా పది నిమిషాల్లో మృతి
మంగళగిరి, జనవరి 17: అదుపు తప్పిన కారు చెరువులో బోల్తా పడటంతో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి ఎర్రబాలెం శివారులో చోటుచేసుకుంది. మంగళగిరికి చెందిన వాసా శ్రీనివాసరావు(28), కొల్లూరి నరేంద్రకుమార్(26), సాయి(26), ఎర్రబాలెం గ్రామానికి చెందిన కాజ తేజోరాంజీ(28)లు ఏపి16 సీఈ 5328 నెంబరు కారులో రాజధాని గ్రామమైన మందడం నుంచి మంగళగిరి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రబాలెం శివారులోకి వచ్చే సరికి చీకట్లో చెరువు చుట్టూ ఉన్న మలుపుల్లో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయకచర్యలను చేపట్టారు. పది నిమిషాల వ్యవధిలోనే కారులోని నలుగురు యువకులను బయటికి తీసుకువచ్చారు. అయినప్పటికీ అప్పటికే వారందరూ మృతి చెందారు. మృతుల్లో తేజోరాంజీ, సాయి డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. బహుశా ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు కావడంతో రాజధాని ప్రాంతంలో ప్లాట్లను పరిశీలించి వస్తూఉండగా ఈ ఘటన జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ జే రాంబాబు, రూరల్ సీఐ భూషణం, ఎస్ఐ లోకేశ్ పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చెరువు చుట్టూ 800 మీటర్ల దూరం రహదారి అత్యంత ప్రమాదకరంగా ఉన్నా అంచుల వెంబడి రక్షణ గోడ లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు.