ప్రమాదంపై ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-19T07:12:52+05:30 IST

రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కూలీలు వారు. ఉదయం లేవగానే అయినవారి మొహమైనా కళ్లారా చూశారో లేదో ! హడావుడిగా ఇంత చద్ది కట్టుకుని

ప్రమాదంపై ప్రమాదం

అనంతలో ఐదుగురి దుర్మరణం

కారు ఢీకొన్న వ్యక్తికి సపర్యలు చేస్తున్న కూలీలు

వారిపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు కూలీలు, క్షతగాత్రుడు మృతి

క్షతగాత్రుడికి సాయం చేస్తుంటే కూలీలను తొక్కేసిన మృత్యులారీ


బత్తలపల్లి, డిసెంబరు 18 : రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కూలీలు వారు. ఉదయం లేవగానే అయినవారి మొహమైనా కళ్లారా చూశారో లేదో ! హడావుడిగా ఇంత చద్ది కట్టుకుని కూలి పనులకు వెళ్లారు. పొద్దువాలకా ఇంటికి తిరిగొస్తుండగా మార్గమధ్యలో కారు ఢీకొని ఓ యువకుడు రోడ్డుపై పడి ఉండటం గమనించారు. అయ్యో! పాపం అంటూ సపర్యలు చేయడానికి వెళ్లారు. ఇంతలో దూసుకొచ్చిన లారీ.. గాయపడిన యువకుడితో పాటు అతడికి సపర్యలు చేస్తున్న కూలీల ఊపిరి తీసింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకొంది. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే.. రాఘవంపల్లికి చెందిన రైతు శ్రీకాంతప్ప ఒక్కగానొక్క కుమారుడు రాజశేఖర్‌(20).


అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా రాఘవంపల్లి క్రాస్‌ వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఆయన బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమయంలో కూలి పనులు ముగించుకొని తిరిగొస్తున్న కూలీలు ప్రమాదాన్ని గమనించి తమ వాహనాలు ఆపి క్షతగాత్రుడికి సపర్యలు చేయడానికి వెళ్లారు. బాధితుడికి వారు సపర్యలు చేస్తుండగానే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్‌ లారీ కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. వారిని తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు(40), ముష్టూరుకు చెందిన శివమ్మ(50), సంజీవపురానికి చెందిన సూరి(45), వలి(50)లు గా గుర్తించారు. వీరిలో శ్రీనివాసులు ఘటనాస్థలిలోనే మరణించగా, మిగతావారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా ప్రాణాలు వదిలారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజు అనే కూలీ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదానికి కారణమైన కారు, లారీ డ్రైవర్లు వాహనాలు వదిలేసి పరారయ్యారు. మృతుల్లో శ్రీనివాసులుకు భార్య సువర్ణ, ఇద్దరు కుమారులు ఉన్నారు.


కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందటంతో భార్యాపిల్లలు వీధిన పడ్డారు. శివమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతి చెందడంతో రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబానికి ఇంటి పోషణ మరింత కష్టమయింది. వలికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వలి బేల్దారి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. సూరి భార్య వదిలేయడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. కూలీ పనులు చేసి పొట్ట నింపుకొంటున్నాడు. 


నీ బదులు మమ్మల్ని తీసుకెళ్లినా బాగుండేదే !

‘‘ప్రయోజకుడై ముసలి వయస్సులో మమ్మల్ని బాగా చూసుకుంటావనుకుంటే మమ్మల్ని వదిలేసి పైలోకాలకు పోతివా నాయనా!  నీ బదులు మమ్మల్ని తీసుకెళ్లినా బాగుండేదే’’

రాజశేఖర్‌ తండ్రి శ్రీకాంతప్ప రోదన

Updated Date - 2020-12-19T07:12:52+05:30 IST