రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-03-03T05:43:55+05:30 IST

మండలంలోని గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట పట్టణం సుబ్బయ్యతోటకు చెందిన మేకపోతుల జ్ఞానేశ్వరరావు(21) అనే బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి
మేకపోతుల జ్ఞానేశ్వరరావు(ఫైల్‌ ఫొటో)

నాదెండ్ల, మార్చి 2: మండలంలోని గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట పట్టణం సుబ్బయ్యతోటకు చెందిన మేకపోతుల జ్ఞానేశ్వరరావు(21) అనే బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. అతను బోయపాలెం సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. కళాశాల నుంచి మోటారు బైకుపై చిలకలూరిపేట వస్తుండగా గుంటూరు వైపు నుంచి వచ్చే కారు ఢీకొంది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జ్ఞానేశ్వరరావును గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిలకలూరిపేట మండలంలోని వేలూరులో ఇసుక అన్‌లోడ్‌ చేసి ట్రాక్టర్‌తో వస్తున్న బోక్యాబాబూనాయక్‌ ఏఎంజీ టీబీ ఆసుపత్రి సమీపంలో ఎదురుగా వెళుతున్న సైకిల్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొని తీవ్రగాయాలపాలయ్యాడు. అదేవిధంగా తిమ్మాపురం గ్రామానికి చెందిన కోడిరెక్క మరియదాసు అనే దివ్యాంగుడు చిలకలూరిపేట నుంచి మూడు చక్రాల మోటారు సైకిల్‌పై తిమ్మాపురం వెళుతుండగా సీఆర్‌ కళాశాల సమీపంలో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో గాయపడిన అతనిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.

దాచేపల్లిలో బాలిక..


దాచేపల్లి: తల్లితోపాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బాలికకు లారీ డోరు తగలడంతో తీవ్రగాయాలపాలైన మృతి చెందిన ఘటన మంగళవారం దాచేపల్లిలోని కారంపూడి బస్టాండు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జ్యోతిబాయి మిర్యాలగూడలో వస్త్రదుకాణంలో పనిచేస్తుంది. రోజూ కొత్తూరు నుంచి మిర్యాలగూడకు వెళ్లివస్తుంది. మంగళవారం కూరుతు వైష్ణవినాయక్‌(12)ను వెనుక కూర్పోపెట్టుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరింది. బస్టాండ్‌ వద్దకు రాగానే బైక్‌కు ముందుగా ఉన్న మినీలారీ డోర్‌ను డ్రైవర్‌ అమాంతంగా ఓపెన్‌ చేశాడు. ఈ క్రమంలో స్కూటీపై వెనుక కూర్చున్న  వైష్ణవికి తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా తీవ్రరక్తస్రావమై మార్గమధ్యంలో మృతిచెందింది. దాచేపల్లి ఎస్‌ఐ రహంతుల్లా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. తల్లి జ్యోతికి స్వల్పగాయాలయ్యాయి. 


Updated Date - 2021-03-03T05:43:55+05:30 IST