విరాట్ కూతురికి అత్యాచార బెదిరింపులు చేసిన వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-11T00:42:35+05:30 IST

రామ్‌నగేష్ శ్రీనివాస్ అకుబత్తిని (23) అనే వ్యక్తి బీటెక్ పూర్తి చేసి ఫుడ్ డెలివరీ చేసే ఒక సంస్థలో టెకీగా పని చేస్తున్నాడు. అయితే టీ-20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ చేతిలో ఇండియా టీం పరాజయం అనంతరం ట్విట్టర్ వేదికగా కోహ్లీ చిన్నారి కూతురికి..

విరాట్ కూతురికి అత్యాచార బెదిరింపులు చేసిన వ్యక్తి అరెస్ట్

ముంబై: క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల నెలల పసిపాపకు అత్యాచార బెదిరింపులు చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కి చెందిన ఇతడిని విచారణ నిమిత్తం ముంబైకి తరలించారు. ప్రస్తుతం ముంబై సైబర్ సెల్ పోలీసుల అదుపులో కస్టడీలో ఉన్నట్లు ఓ ప్రకటనలో ముంబై పోలీసులు తెలిపారు.


రామ్‌నగేష్ శ్రీనివాస్ అకుబత్తిని (23) అనే వ్యక్తి బీటెక్ పూర్తి చేసి ఫుడ్ డెలివరీ చేసే ఒక సంస్థలో టెకీగా పని చేస్తున్నాడు. అయితే టీ-20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ చేతిలో ఇండియా టీం పరాజయం అనంతరం ట్విట్టర్ వేదికగా కోహ్లీ చిన్నారి కూతురికి అత్యాచార బెదిరింపులు చేశాడు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.


ఈ విషయమై ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విరాట్-అనుష్కల కూతురిపై వచ్చిన అత్యాచార బెదిరింపుల పట్ల సమాధానం చెప్పాలని నోటీసులో ఢిల్లీ మహిళా కమిషన్ పేర్కొంది. అంతే కాకుండా ఈ చర్యలు ‘‘అత్యంత అవమానకరమైంది’’ అని పేర్కొన్న ఢిల్లీ మహిళా కమిషన్.. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించింది.


గతేడాది ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూతురికి (అప్పటికి 5ఏళ్లు) కూడా అత్యాచార బెదిరింపులు వచ్చాయి. 2020 అక్టోబర్‌లో జరిగిన ఐపీఎల్‌లో ధోని సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆశించినంతగా రాణించలేకపోయింది. దీంతో ధోనీని టార్గెట్ చేస్తూ నెటిజెన్లు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ధోని కూతురికి అత్యాచార బెదిరింపులు చేశాడు.

Updated Date - 2021-11-11T00:42:35+05:30 IST