అప్పుడు అసెంబ్లీలో సినిమా చూపించారు... ఇప్పుడు నోరు తెరవడం లేదు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-01-20T18:04:50+05:30 IST

ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని, ముక్కలు చేయాలని..ముఖ్యమంత్రి చూస్తున్నారని...

అప్పుడు అసెంబ్లీలో సినిమా చూపించారు... ఇప్పుడు నోరు తెరవడం లేదు: అచ్చెన్న

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని, ముక్కలు చేయాలని..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని, ఒకే ఒక నినాదంతో ముందుకు వెళుతున్నారని, అదే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదం చట్టంలో లేదని తాము ఆనాడే చెప్పామన్నారు. ఇది కోర్టులో నిలబడదని కూడా చెప్పామన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పబ్బం గడుపుకోవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అయితే ఒకడుగుముందుకేసి తమ పేర్లన్నీ చదివారని, అసెంబ్లీలో సినిమా చూపించారని...ఇప్పుడెండుకు నోరు తెరవడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.


సీఎం జగన్, మంత్రి బుగ్గన, వైసీపీ నాయకులంతా కలిసి ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు.. ఆయన అనుచరులు భూములు కొనుగోలు చేశారు కాబట్టే రాజధానిని ముక్కలు చేస్తున్నామని అన్న విషయాన్ని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అయితే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. న్యాయస్థానం ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేసినా సీఎం జగన్ మారడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తీరు మార్చుకుని, రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-01-20T18:04:50+05:30 IST