మమత విచారణలో కీలక అంశాలు రాబట్టాం : ఏసీపీ
ABN , First Publish Date - 2020-08-15T02:01:28+05:30 IST
విజయవాడ : నగరంలోని స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో
విజయవాడ : నగరంలోని స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డాక్టర్ కోడలు మమతకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. దీంతో విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. 6 గంటల పాటు మమతను పోలీసులు విచారించారు. ఈ విచారణ అనంతరం కేసు ఇన్వెస్టిగేషన్ అఫీసర్ ఏసీపీ సూర్యచంద్రరావు మీడియా మీట్ నిర్వహించారు.
ఇప్పటి వరకూ మొత్తం పది మందికి స్వర్ణ ప్యాలెస్ ఘటనలో నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇవాళ డాక్టర్ మమత విచారణకు హాజరయ్యారని.. కోవిడ్ కారణంగా బ్రేక్ ఇచ్చామని ఇంకా విచారణ చేయాల్సి ఉందన్నారు. ఇవాళ జరిగిన విచారణలో డాక్టర్ మమత విచారణలో కీలక అంశాలు రాబట్టామని ఏసీపీ మీడియాకు వెల్లడించారు.
సహకరించకపోతే అరెస్ట్ చేస్తాం!
‘ కోవిడ్ పేషెంట్ల నుంచీ అధిక పీజులు వసూలు ఆరోపణలపైన విచారణ కొనసాగుతోంది. డాక్టర్ మమత అగ్ని ప్రమాదం జరిగిన కొవిడ్ కేర్ సెంటర్ పర్యవేక్షణ కూడా చూశారు. రిమాండ్లో ఉన్న ముగ్గురిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటీషన్ వేశాం. సోమవారానికి విచారణ వాయిదా పడింది. వారిని కష్టడీకి తీసుకుని వారి నుంచీ సేకరించాల్సిన వివరాలు చాలా ఉన్నాయి. నోటీసులు అందుకున్న వారంతా విచారణకు సహకరిస్తారని భావిస్తున్నాం. విచారణకు సహకరించకపోతే సెక్షన్-171 ప్రకారం అరెస్టు చేసే అధికారం మాకుంది’ అని ఏసీపీ సూర్యచంద్రరావు మీడియా వేదికగా స్పష్టం చేశారు.