రైతులను మోసగిస్తున్న వ్యాపారులపై చర్యలు
ABN , First Publish Date - 2021-06-19T05:27:32+05:30 IST
రైతుల వద్ద తక్కువ ధరకు మామిడి కాయలు కొనుగోలు చేసి, గుజ్జు పరిశ్రమలకు అధిక ధరలకు విక్రయించే మండీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ అధికారులను కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.
కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 18: రైతుల వద్ద తక్కువ ధరకు మామిడి కాయలు కొనుగోలు చేసి, గుజ్జు పరిశ్రమలకు అధిక ధరలకు విక్రయించే మండీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ అధికారులను కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను నిర్వహించిన సమావేశాల్లో గుజ్జు పరిశ్రమల యజమానులు అంగీకరించిన ధరలకు కాయలు కొనుగోలు చేయకపోవడం శోచనీయమని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండీలను తనిఖీ చేసి వ్యాపారుస్థులు గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు మామిడి కాయలు ఇష్టమైన ధరలకు అమ్ముకునేలా చైతన్య పరచాలన్నారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ శ్రీనివాస్, మార్కెటింగ్శాఖ ఏడీ ఇందుమతి, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.