అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-05-14T05:16:36+05:30 IST
అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు
- ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులకు మంత్రి సబితారెడ్డి సూచన
- రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
- మేడ్చల్ కలెక్టరేట్లో మంత్రి మల్లారెడ్డి సమీక్ష
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజు వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా బాధితులకు అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందేలా తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో రెండో దశ కొవిడ్ ఉధృతి నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలెక్టరేట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో 2,22,389 కుటుంబాల్లో ఫీవర్ సర్వే నిర్వహిస్తే 6,333మందికి స్వల్ప లక్షణాలున్నాయని, వారిలో 6,026 మందికి కిట్లు, మందులు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 14 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం మూడు ఆసుపత్రుల్లోనే ఎక్కువ సంఖ్యలో రోగులకు కొవిడ్ వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,36,596 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుత ం 6,737 యాక్టివ్ కేసులున్నాయన్నారు. జిల్లాలో 76,182 మందికి వ్యాక్సినేషన్ పూర్తికాగా, మరో 46 వేల మందికి రెండో డోస్ వేయాల్సి ఉందన్నారు. రెమిడెసివర్ ఇంజెక్షన్లతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. వికారాబాద్లో ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతున్నామని తెలిపారు. తాండూరులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేంద్రంలో నియమితులైన డాక్టర్లు, నర్సులు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ప్రైవేట్ ఆసుపత్రులను తరుచుగా తనిఖీ చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డీఎంహెచ్వోను ఆదేశించారు. జిల్లాస్థాయిలో వేసిన కమిటీలు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పైలెట్ రోహిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ నారాయణ, టీఎ్సఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, జడ్పీ వైస్చైర్మన్ విజయకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, మునిసిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, డీఈవో రేణుకాదేవి, డీఎంహెచ్వో సుధాకర్ సింధే, డీఎ్సవో అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
- ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి
మేడ్చల్ అర్బన్ : కరోనా కట్టడికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్లో కలెక్టర్ శ్వేతామహంతి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వాదేశాలను ప్రజలు పాటించేలా చూడాలన్నారు. ఆరోగ్య సర్వేను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వాసుపత్రులు, కరోనా కేర్ సెంటర్లలో ఆకి ్సజన్ నిల్వలు తగ్గకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అనంతరం కలెక్టర్ శ్వేతామహంతి మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పక్కా ఏర్పాట్లు చేశామని, జిల్లా ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్స్, పీహెచ్సీల్లో తగినంత సిబ్బంది, మందులు, ఆక్సిజన్ను అందుబాటులో ఉంచామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వ నింబంధనలు పాటించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, జాన్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, డీఎంఅండ్హెచ్వో మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.
- కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు : మంత్రి మల్లారెడ్డి
ఘట్కేసర్ : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం మేడల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో పర్యటించారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రిని సందర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం జడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న కరోనా పరీక్ష కేంద్రంను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా పరీక్షల కోసం వచ్చిన వారు మంత్రి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. పరీక్ష కోసం చాలా ఇబ్బందులు పడాల్సివస్తుందని వారు వాపోయారు. ఉదయం 6గంటలకు వచ్చి క్యూలో నిలబడితే మధ్యాహ్నం 12గంటల వరకు ఉండాల్సి వస్తోందన్నారు. టెస్టుల సంఖ్య పెంచాలని వారు మంత్రికి విన్నవించారు. అనంతరం యంనంపేట్ చౌరస్తాలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- అధికారులు, ప్రజాప్రతినిఽధులతో సమీక్షా సమావేశం
ఘట్కేసర్లోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డిలో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సురారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో 300 బెడ్లు, నాచారంలోని ఈఎ్సఐ ఆసుపత్రిలో 100 బెడ్లు, సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 100 బెడ్లతో ఐపొలేషన్ సెంటర్ను సిద్ధం చేస్తున్నామన్నారు.వీటితోపాటు పీర్జాదిగూడలో 20, ఘట్కేసర్లో 10 బెడ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 15 రోజులపాటు నాయకులు కరోనా బాధితులకు సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున్, ఉపవైద్యాధికారి నారాయణరావు, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, వైస్చైర్మన్ పల్గుల మాధవరెడ్డి, నాయకులు చామకూర భద్రారెడ్డి, బండారి శ్రీనివా్సగౌడ్. రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.