హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2020-07-02T15:01:13+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేతల స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా మాదాపూర్‌ గురుకుల ట్రస్ట్‌భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మాదాపూర్‌, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాల కూల్చివేతల స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా మాదాపూర్‌ గురుకుల ట్రస్ట్‌భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్‌ తెలిపారు. బుధవారం ఐదు భవనాలను ఎక్సకవేటర్‌ సాయంతో నేలమట్టం చేశారు. మొత్తం 29అక్రమ నిర్మాణాలను గుర్తించామని, ఇప్పటి వరకు 25 నిర్మాణాలను కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. 


కాముని చెరువు స్థలంలో..

కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలోని కాముని చెరువు స్థలంలో వెలిసిన ఆక్రమణలను పూర్తిస్థాయిలో కూల్చివేయడంలో అధికారులు విఫలమయ్యారు. లాక్‌డౌన్‌లో పెద్దఎత్తున నిర్మాణాలు వెలిసిన నేపథ్యంలో మంగళవారం 3 గదులు, 2 బేస్‌మెంట్లను మాత్రమే అధికారులు కూల్చివేశారు. కాముని చెరువులో జరుగుతున్న ఆక్రమణలపై గత సోమవారం ఆంధ్రజ్యోతి ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. రెవిన్యూ, ఇరిగేషన్‌ విభాగాల అధికారులు కూల్చివేతలు చేపట్టినా... పోలీసు బందోబస్తు సరిగ్గాలేదన్న  కారణంతో కొన్ని నిర్మాణాలను కూల్చలేదు. త్వరలోనే మళ్లీ కూల్చివేతలు చేపడతామని అధికారులు తెలిపారు.


ఆల్విన్‌కాలనీలో..

హైదర్‌నగర్‌: ఆల్విన్‌కాలనీ డివిజన్‌ సర్వేనెంబర్‌ 57, 336లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన షెడ్లను, బెస్‌మెంట్‌లను కూకట్‌పల్లి తహసీల్దార్‌ సంజీవ్‌రావు ఆఽధ్వర్యంలో సిబ్బంది, పోలీసుల సాయంతో బుధవారం జేసీబీతో కూల్చివేశారు.  


అల్మాస్ గూడలో ..

సరూర్‌నగర్‌: బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అల్మాస్ గూడలో హెచ్‌ఎండీఏ గ్రీన్‌ బెల్ట్‌ పరిధిలో పలు అక్రమ నిర్మాణాలను కమిషనర్‌ సత్యబాబు ఆదేశాల మేరకు టీపీబీవో ఎస్‌.పావనీరావు ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఇక్కడి నిర్మాణాలపై ఇటీవల పలుమార్లు స్థానికుడు చప్పిడి రాజిరెడ్డి జిల్లా కలెక్టర్‌, హెచ్‌ఎండీయే కమిషనర్‌ తదితరులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-07-02T15:01:13+05:30 IST