అక్రమాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు
ABN , First Publish Date - 2022-01-26T04:31:43+05:30 IST
అక్రమాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు
- పోచారం సర్పంచ్కు అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ హెచ్చరిక
- ఆక్రమణకు గురైన గ్రామకంఠం, నర్సరీ పరిశీలన
ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 25: గ్రామంలో అక్రమాలకు పాల్పడినా, ప్రోత్సహించినా సహించేదిలేదని పోచారం సర్పంచ్ అరుణనరేందర్ను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ హెచ్చరించారు. పోచారంలో మంగళవారం కబ్జాకు గురైన గ్రామకంఠం భూమిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడారు. దీనిపై రెవెన్యూ అధికారులతో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణజరిపి రిపోర్టు చేయాలని జడ్పీసీఈవోను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ స్థలంలో ప్రస్తుతం ఉన్న కట్టడాలు అలాగే ఉండాలని, నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని సర్పంచ్కు సూచించారు. ఈ స్థలానికి సంబంధించి ప్రతీ డాక్యుమెంట్ ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని తనిఖీ చేశారు. ఇందులో ఎక్కువగా పండ్లు, పూల మొక్కలు, తులసి పెంచాలని సూచించారు. నర్సరీ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ ప్రభాకర్, జడ్పీ సీఈవో దిలీ్పకుమార్, పీడీ ప్రభాకర్, అడిషనల్ పీడీ సుక్రు, ఎంపీడీవో క్రాంతికుమార్, ఎంపీపీ కృపేష్ పాల్గొన్నారు.